అప్పుడు చిరంజీవి, ఇప్పుడు జగన్: బాబు మండిపాటు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ మాటలను ప్రజలు నమ్మరన్నారు. ఆమె సానుభూతి గెలుపొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అవినీతికి పాల్పడిన జగన్ జైలు నుండి బయటకు వచ్చే అవకాశమే లేదన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్ అండ్ కంపెనీ భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. తిరుపతి జగన్ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి టిటిడి చైర్మన్గా ఉన్నప్పుడు శ్రీవారి సేవా టిక్కెట్లు అమ్ముకొని కోట్లు సంపాదించారని ఆరోపించారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అప్పుడే కంట్రోల్లో పెట్టి ఉంటే అవినీతి ఈ స్థాయిలో ఉండేది కాదన్నారు. ఓ కుటుంబం చేసిన తప్పుల వల్ల ఎంతోమంది జైలుకు వెళుతున్నారన్నారు. రాష్ట్ర సంపద అంతా వైయస్ బంధువులు, ఆయన స్నేహితుల చేతుల్లో ఉందన్నారు. వైయస్ కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయాయని మండిపడ్డారు. సోనియా అండతోనే వైయస్ రెచ్చిపోయారన్నారు.
అధికారం కోసం కాంగ్రెసు నేతలు ఏమైనా చేస్తారని దుయ్యబట్టారు. తన కుటుంబం ఆస్తులు తాను ఎప్పుడో ప్రకటించానని, తాను ప్రకటించిన వాటికంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే వాటిని వారికే రాసిస్తానని బాబు సవాల్ విసిరారు. తన ఆస్తులపై నిరాధార ప్రకటనలు చేసిన వారికి లీగల్ నోటీసులు ఇస్తానని చెప్పారు. అభివృద్ధిలో రాష్ట్రం ఇరవయ్యేళ్లు వెనక్కి పోయిందన్నారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి రూ.60 కోట్లు ఖర్చు పెట్టి న్యాయవ్యవస్థను దిగజార్చారన్నారు.
మద్యం సిండికేట్ల వ్యవహారంలో మంత్రులందరినీ ఎసిబి విచారించాలని డిమాండ్ చేశారు. కాగా అంతకుముందు చంద్రబాబు నాయుడు నైవేద్య విరామ సమయంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయ ప్రవేశం చేసి వేంకటేశ్వర స్వామి వారిని దర్సించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు బాబుకు ఆశీర్వచనాలు అందచేశారు. ఆంజనేయస్వామిని దర్శించుకున్న బాబు, అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. బాబు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం, ముగించడం శ్రీవారి దర్శనంతోనే ప్రారంభిస్తారు. కాగా అనంతరం బాబు ప్రచారం నిమిత్తం కడపకు బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications