వైయస్ ఉంటే సిఎం పదవి పోయి, జైలుకు: లగడపాటి

వైయస్ మరణించినప్పుడు బాధపడ్డామని, కానీ ఇప్పుడు చూస్తే, జగన్ చేస్తున్న నిర్వాకాలను చూడకుండానే దేవుడు ఆయనను ముందుగా తీసుకుపోవడమే మంచిదనిపిస్తోందన్నారు. లేదంటే కొడుకు నిర్వాకాన్ని చూడాల్సి వచ్చేదని, జగన్ అవినీతితో ఆయన ప్రతిష్ఠ మంటకలిసేదన్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా దిగిపోవాల్సి వచ్చేదేమో అని ఆవేదన వ్యక్తం చేశారు. 2009 రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ సీట్లు తగ్గడానికి జగన్ అవినీతే కారణమన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై విజయలక్ష్మి, షర్మిల చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు. తనలాగే భర్తను కోల్పోయారనే బాధతో సాటి మహిళగా సోనియా వైయస్సార్ కుటుంబీకుల్ని ఓదార్చారాని, బాధలో ఉన్న విజయమ్మని ఆమె కాళ్ల దగ్గర కూర్చొని సోనియాగాంధీ పరామర్శించారని, అలాంటి నాయకురాలిపై రోడ్డెక్కి విమర్శలు చేయడం అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కుర్చీ దక్కలేదనే అక్కసుతోనే వారిలాంటి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్ మరణించిన మూడేళ్లకు అనుమానాలు వ్యక్తం చేయడం దారుణమన్నారు.
ఓదార్పుయాత్ర చేయడమే తమ కుటుంబంపై, జగన్పై కక్షసాధింపులకు కారణమన్న విజయమ్మ ఆరోపణపై స్పందిస్తూ.. ఓదార్చవద్దని సోనియా చెప్పలేదని, కాకపోతే డప్పులు, వాద్యాలు, బాణసంచా పేలుళ్లు, పూల వర్షాల మధ్య ఓదార్పు యాత్ర నిర్వహించడం మంచిది కాదని సూచించారన్నారు. వైయస్సార్ మరణించిన కొద్ది రోజులకు జగన్ ఢిల్లీకి వెళ్లి సోనియాను కలిశారన్నారు. తిరిగొచ్చిన తరువాత, సోనియాపై విశ్వాసం ఉందని, సంతకాల సేకరణ ఆపాలాని మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలకు ఆయన సూచించారన్నారు.
అప్పట్లో ఆయన అధిష్ఠానానికి జై కొట్టారని, ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవి రాదని తెలిసిందో అప్పటి నుంచి ఎదురు దాడికి దిగారన్నారు. సోనియా పట్ల విశ్వాసముందన్న నోటితోనే విమర్శలు చేయడం దారుణమన్నారు. పావురాలగుట్టలో వైయస్ ఆచూకీ కోసం అందరూ వేచి చూస్తోంటే జగన్ మాత్రం హైదరాబాద్లో సంతకాల సేకరణ చేపట్టారని విమర్శించారు. దీన్ని బట్టి అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తారని స్పష్టమయిందన్నారు. జగన్ అక్రమాల వల్ల వైయస్ ప్రతిష్ఠకు భంగం కలిగిందన్నారు.
తండ్రి అడుగు జాడల్లోనే జగన్ నడుస్తున్నారని వైయస్ చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. వైయస్ మాట తప్పడని, జగన్ మూట విప్పడని ఎద్దేవా చేశారు. పరకాలలో వైయస్ విజయమ్మ, షర్మిల మాటలతోనే టిఆర్ఎస్తో కుదుర్చుకున్న చీకటి ఒప్పందం బయటపడిందన్నారు. కాగా, ఉప ఎన్నికల్లో ఓట్లు వేసి తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఆగస్టులోగా సమైక్య వాదానికి అనుకూలంగా ప్రకటన చేయించేందుకు కృషి చేస్తామని లగడపాటి రాజగోపాల్ విలేకరులడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.












Click it and Unblock the Notifications