బాబు 'క్యారెక్టర్', బొత్స 'కుట్ర': విజయమ్మ ఎదురుదాడి

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతి చెందిన రోజు తనతో పాటు రాష్ట్ర ప్రజలకు దురదృష్టకరమైన రోజు అని ఆమె అన్నారు. కాంగ్రెసు పార్టీలో ఉంటే తన తనయుడు వైయస్ జగన్కు ముఖ్యమంత్రి పీఠం గానీ కేంద్రమంత్రి పదవి గానీ ఇచ్చే వారని సాక్ష్యాత్తూ ఆ పార్టీ నేత గులాం నబీ ఆజాదే చెప్పారని ఆమె చెప్పారు. అంటే జగన్ కాంగ్రెసును వీడినందుకే కుట్రతో ఆయనను లక్ష్యంగా చేసుకున్నారని ఆజాద్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందన్నారు.
వైయస్ ఉండగా పొగిడిన వారు ఇప్పుడు ఆయనను నేరస్తుడిగా ప్రజల్లో చూపించే కుట్రకు తెరతీశారన్నారు. వైయస్ కొడుకు అయినందుకు జగన్ను విచారిస్తారట అని మండిపడ్డారు. కుట్రపూరితంగా జైల్లో పెట్టారన్నారు. వైయస్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ సచివాలయంలో అడుగు పెట్టింది లేదని, మంత్రులు, అధికారులతో మాట్లాడింది లేదన్నారు. అలాంటప్పుడు అతనిని జైలుకు ఎందుకు పంపించారని ఆమె ప్రశ్నించారు.
ఇతరుల పైన కోర్టులు విచారణకు ఆదేశించినప్పటికీ నెల రోజులైనా విచారణ ప్రారంభించని సిబిఐ జగన్ ఆస్తుల విచారణను మాత్రం ఇరవై నాలుగు గంటలలో ప్రారంభించిందని ఆరోపించారు. ఇన్ని కుట్రలు జగన్ పైన ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. హెలికాప్టర్ ప్రమాదం పైన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. వైయస్ హెలికాప్టర్ ప్రమాదంలో కుట్ర తమది అని చెబుతున్నారని ఇంతకన్నా ఘోరం ఉందా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తన భర్తే అధికారంలో ఉన్నప్పుడు తనకు అధికారం ఎందుకన్నారు. తాను అప్పుడు ఎప్పుడైనా బయట కనిపించానా అని ప్రశ్నించారు. అలాంటి తనకు అధికారం మక్కువ అని బొత్స చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్కు అధికార దాహం ఉంటే 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసినప్పుటే ముఖ్యమంత్రి అయ్యే వారన్నారు. కొణిజేటి రోశయ్యను ముఖ్యమంత్రిగా ప్రతిపాదించింది జగనే అని చెప్పారు
తమ కుటుంబం పైన కాంగ్రెసు, టిడిపిలు కలిసి కుట్ర పన్నుతున్నాయని అందుకే మీ నిర్ణయం కోసం మీ ముందుకొచ్చామని విజయమ్మ ప్రజలను ఉద్దేశించి అన్నారు. అనుకోని పరిస్థితుల్లోనే తాను బయటకు వచ్చానని అన్నారు. తాను తన కొడుకును సరిగా పెంచడం లేదని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని, తమ పిల్లలకు చిన్నప్పుడే వైయస్ మంచి చెప్పారన్నారు. మనం మన కోసం బతికి ఉండటం కాదని మన చుట్టూ ఉన్న వారి కోసం బతికాలని పిల్లలకు వైయస్ చెప్పే వారన్నారు. సాధ్యమైనంత వరకు గ్రామానికి, జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి సేవ చేయాలని జగన్ను చిన్నప్పుడే నూరిపోశారన్నారు.
క్యారెక్టర్ అంటే ఎలా ఉండాలో మాకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తన కొడుకు ప్రవర్తనను తప్పు పట్టాల్సిన అవసరమే లేదన్నారు. మాకు ఓటు అడిగే హక్కు కూడా లేదంటున్నారని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వస్తే ఏం చేస్తారని అడుగుతున్నారని.. పార్టీ జెండాలో ఉన్న సంక్షేమ పథకాలు అన్నింటిని అమలు చేస్తాడన్నారు.
తన కుటుంబంపై జరుగుతున్న కుట్రను ఎదుర్కొనేలా తమకు న్యాయం చేయమని కోరుతున్నానని అన్నారు. అందుకు ఓటు హక్కే ప్రధాన ఆయుధం అన్నారు. జగన్ బయటకు వచ్చి ప్రచారంలో పాల్గొనకుండా జైలులో పెట్టారన్నారు. ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవని, రాష్ట్ర రాజకీయాలను మారుస్తాయన్నారు.












Click it and Unblock the Notifications