జగన్ పెదవి విప్పట్లేదు, నార్కో టెస్టులు చేస్తాం: సిబిఐ

నార్కో టెస్టులకు అనుమతిపై వైయస్ జగన్మోహన్ రెడ్డి తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నార్కో టెస్టులు సైంటిఫిక్గా రుజువు కాలేదని చెప్పారు. నార్కో టెస్టులకు అనుమతి కోరడం ద్వారా సిబిఐ సుప్రీం కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తోందని జగన్ తరఫు న్యాయవాదులు అన్నారు. కోర్టు ఇరువురి వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను 14వ తేదికి వాయిదా వేసింది.
తాము ఏడు రోజుల కస్టడీలో జగన్ పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని సిబిఐ కోర్టుకు తెలిపింది. సైంటిఫిక్ పద్ధతులలో ఎలాంటి హానీ జరగదని, విజయసాయి రెడ్డితో కలిసి జగన్ కుట్ర పన్నారని తెలిపారు. విచారణ సమయంలో జగన్ తెలివిగా సమాధానం చెప్పారన్నారు. ఆయన సరైన సమాచారం ఇవ్వలేదన్నారు. హవాలా రూపంలో జగన్ కంపెనీలలోకి డబ్బు తరలిందని, దీనిపై ఆరు దేశాలకు ఫిబ్రవరిలో రెగోరేటరీ లేఖలు రాసినట్లు తెలిపారు.
పూర్తిస్థాయిలో ఆధారాల కోసం సైంటిఫిక్ విచారణకు అనుమతివ్వాలని కోరారు. నార్కో, బ్రెయిన్, పాలిగ్రాప్ టెస్టులకు అనుమతివ్వాలన్నారు. దీనికి జగన్ తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. నార్కో టెస్టులకు అనుమతివ్వవద్దని, కోమాలోకి తీసుకు వెళ్లి చెప్పించేవి చెల్లవని అన్నారు. ఇది వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలగడంతో పాటు ఈ టెస్టుల వల్ల ఆరోగ్యం కూడా క్షీణిస్తుందన్నారు.
కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఈ కేసులోని పదమూడుమంది నిందితులు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. వైయస్ జగన్తో పాటు, విజయ సాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రామి రెడ్డి, నిత్యానంద రెడ్డి తదితరులు కోర్టుకు హాజరయ్యారు. కోర్టు వారికి సిబిఐ సమర్పించిన రెండో, మూడో ఛార్జీషీట్ల కాపీలను ఇచ్చింది.
కాగా జగన్మోహన్ రెడ్డిని పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో నాంపల్లి కోర్టు నుండి చంచల్గూడ జైలుకు తరలించారు. జగన్ను కలిసేందుకు వచ్చిన ఆయన తల్లి వైయస్ విజయమ్మ, సోదరి షర్మిల, భార్య భారతిలతో మాట్లాడేందుకు కోర్టు అరగంట పాటు అనుమతి ఇచ్చింది. దీంతో జగన్ వారితో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గదిలో వారితో మాట్లాడారు.












Click it and Unblock the Notifications