జగన్ కేసులో ఛార్జీషీట్: సాక్షి మీడియాకు ప్రకటనలపై!
జగన్కు సంబంధించిన పత్రిక ప్రారంభమైన వెంటనే అనేక మినహాయింపులతో ప్రభుత్వం ప్రకటనలు జారీ కావడంపై సిబిఐ అనేక ఆధారాలు సేకరించిందని తెలుస్తోంది. ఇటీవల జగతికి వచ్చిన ప్రకటనలపై సిబిఐ అధికారులు పలువురిని విచారించిన విషయం తెలిసిందే. ప్రయివేటు యాడ్స్ ఏజెన్సీ నిర్వాహకుల వాంగ్మూలాలను అధికారులు రికార్డ్ చేశారు. అలాగే సమాచారశాఖలో పలువురు ఉన్నతాధికారులను కూడా విచారించారు.
దాదాపు అందరిని విచారించిన సిబిఐ జగతి పబ్లికేషన్స్కి వచ్చిన మొత్తం ప్రకటనల వివరాలతో జగన్ను ఏ1గా, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని ఏ2గా, జగతి పబ్లికేషన్స్ను ఏ3గా పేర్కొంటూ ఛార్జీషీట్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మూడు ఛార్జీషీట్లు దాఖలు చేసిన సిబిఐ మూడు ఛార్జీషీట్లలోనూ జగన్ను ఏ1గా పేర్కొంది. సిబిఐ కోర్టులో దాఖలు చేసే అన్ని ఛార్జీషీట్లలో జగన్నే ఏ1గా పేర్కొనే అవకాశముంది.
కాగా జగన్ సిబిఐ కస్టడీ, జ్యూడిషియల్ రిమాండ్ ముగియడంతో సోమవారం నాంపల్లి కోర్టులో అతనిని హాజరుపర్చారు. కోర్టు అతనికి రెండువారాలు(25వ తేది వరకు) రిమాండు పొడిగించింది. జగన్ను, విజయ సాయి రెడ్డిని నార్కో టెస్టులకు అనుమతించాలన్న సిబిఐ పిటిషన్ పైన తదుపరి విచారణను 14వ తేదికి వాయిదా వేసింది.