వెబ్ లైన్ కట్, మాచర్లలో హైఅలర్ట్: పరకాలలో ఉద్రిక్తం
ఈ వెబ్ కెమెరాల ద్వారా ఎన్నికల సంఘ అధికారులు ప్రతి ఓటింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తుంది. ఎక్కడైనా అవకతవకలు జరిగితే ఈ వెబ్ కెమెరాల ద్వారా దొరికిపోతారు. ఎవరైనా రిగ్గింగ్కు పాల్పడినా అధికారులు దీని ద్వారా పట్టేస్తారు. ఒంగోలులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులు వెబ్ కెమెరాల ద్వారా చిక్కడంతో వారిని అరెస్టు చేశారు. మాచర్లలో రెండు పార్టీలు రిగ్గింగ్ కోసం వెబ్ కెమెరా కేబుల్సును కట్ చేసేందుకు కుట్ర చేశాయని అంటున్నారు.
కొన్నిచోట్ల అప్పటికే కేబుల్స్ తెగిపోయాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎన్నికల సంఘం పోలీసులను హైఅలర్ట్గా ఉండాలంటూ ఆదేశించింది. దీంతో మాచర్ల నియోజకవర్గం మొత్తం పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా పోలీసు యంత్రాంగాన్ని అక్కడకు తరలించారు. బూత్ల వద్ద పారామిలటరీ దళాలను నియమించారు. అవసరమైతే అదనపు బలగాలను పంపిస్తామని ఈసి పోలీసులకు సూచించింది.
జిల్లాలోని వెల్దుర్తి, రెంటచింతల, కారంపూడి, దుర్గి మండలలాలోని బూత్లను స్వాధీనం చేసుకునేందుకు పార్టీలు పన్నాగం పన్నాయని అంటున్నారు. మరోవైపు వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలో ఓటు వేయడానికి గుంపుగా వస్తున్న స్థానికులపై పోలీసులు లాఠీఛార్జ్ జరిపారు. ఈ ఘటన కొండారెడ్డిపల్లిలో జరిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు పోలీసు జీపును ధ్వంసం చేశారు.
ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్ల గ్రామంలో ఐదుగురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలోని సావరకోటలో భారీగా వర్షం కురియడంతో కాసేపు ఓటింగ్కు అంతరాయం ఏర్పడింది. కాగా మధ్యాహ్నం ఒకటింటి వరకు యాభై శాతం ఓటింగ్ జరిగింది. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు రిగ్గింగ్కు పాల్పడ్డాయని మళ్లీ ఓటింగ్ జరపాలని పత్తిపాడు నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తలు డిమాండ్ చేశారు.
ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా నెల్లూరు లోకసభ స్థానం కాంగ్రెసు పార్టీ అభ్యర్థి క్యూ లైన్లో ప్రచారం చేశారని ఫిర్యాదు అందిందని, దానిపై వివరణ అడిగామని భన్వర్ లాల్ చెప్పారు. ఒంగోలులో ఇద్దరు అధికారులు వృద్ధుడికి సహకరించారని, వృద్దుడికి సహకరించడంలో ఏజెంట్లు అభ్యంతరం తెలుపలేదని భన్వర్ లాల్ చెప్పారు.