ఉప ఫలితాలు: కిరణ్ రెడ్డి, బొత్స, చిరంజీవి సేఫ్
వైయస్సార్, కాంగ్రెసు పార్టీల మధ్యనే హోరాహోరీ పోరు సాగింది. ప్రస్తుత ఫలితాలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి ఊరటనిచ్చాయనే చెప్పాలి. ప్రస్తుత ఫలితాలతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు పెద్దగా మారే సూచనలు కనిపించడం లేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనుకున్నట్లు అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ మెజారిటీలు తక్కువగా ఉండడం దానికి కారణం. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 2014 ఎన్నికల నాటికి మరింతగా తన బలాన్ని కోల్పోతుందనే వాదనను పార్టీ అధిష్టానం ముందు పెట్టడానికి రాష్ట్ర నాయకత్వానికి అవకాశం చిక్కింది.
ఉప ఎన్నికలు జరిగిన 18 శాసనసభా స్థానాలు కూడా కాంగ్రెసు పార్టీకి చెందినవే అయినా, వైయస్ జగన్ పార్టీతో కాంగ్రెసు గల్లంతవుతుందనే అంచనాలను ఈ ఉప ఎన్నికలు తిప్పకొట్టాయి. తాము కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో తిరిగి విజయం సాధించడానికి వీలవుతుందని రాష్ట్ర కాంగ్రెసు నాయకులు భావిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పట్ల ఇప్పుడున్న సానుభూతి సాధారణ ఎన్నికల నాటికి ఉండదనే అభిప్రాయాన్ని కాంగ్రెసు రాష్ట్ర నాయకులు ముందుకు తెస్తున్నారు.
కాగా, నెల్లూరు లోకసభ స్థానంలో మాత్రం కాంగ్రెసుకు పెద్ద దెబ్బనే తగిలింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి కాంగ్రెసు అభ్యర్థి టి. సుబ్బిరామి రెడ్డిపై భారీ ఆధిక్యతతో విజయం సాధించింది. అయితే, సుబ్బిరామిరెడ్డి చాలా కాలంగా నెల్లూరు జిల్లాకు దూరంగా ఉండడం ఓటమికి కారణమని కాంగ్రెసు నాయకులు అంటున్నారు. మొత్తం మీద, రాష్ట్ర కాంగ్రెసు నాయకులకు ఊపిరి పీల్చుకునే ఫలితాలే వచ్చాయని చెప్పాలి.