మేకపాటి ఘన విజయం: లోకసభలో 2కు పెరిగిన బలం
కాగా వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలిచిన అసెంబ్లీ స్థానాలు - నర్సన్నపేట, పాయకరావుపేట, పోలవరం, ప్రత్తిపాడు, మాచర్ల, ఒంగోలు, ఉదయగిరి, అనంతపురం అర్బన్, రాయదుర్గం, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు, ఒంగోలు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు, రామచంద్రాపురంలో కాంగ్రెసు అభ్యర్థి తోట త్రిమూర్తులు గెలిచారు. తిరుపతి స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధిక్యంలో ఉంది. పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖ గట్టి పోటీ ఇస్తున్నారు. చివరి నిమిషంలో పరకాలపై తీవ్ర ఉత్కంఠ చోటు చేసుకుంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 14 స్థానాలు గెలిచి, ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెసు రెండు స్థానాలు గెలుచుకుంది. టిడిపి ఒక స్థానంలో కూడా ఆధిక్యతను ప్రదర్సించలేకపోయింది. తొలుత రామచంద్రాపురంలో ఆధిక్యంలో కొనసాగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆ తర్వాత కాంగ్రెసుపై వెనకబడిపోయింది. ఇక్కడ కాంగ్రెసు అభ్యర్థి తోట త్రిమూర్తులు విజయం సాధించారు.
రామచంద్రాపురం, తిరుపతి, ఉదయగిరి వంటి స్థానాల్లో కాంగ్రెసు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కాంగ్రెసు గట్టి పోటీ ఇచ్చింది. రామచంద్రాపురంలో కాంగ్రెసు అభ్యర్థి తోట త్రిమూర్తులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్కు గట్టి పోటీ ఇచ్చి విజయం సాధించారు. తిరుపతిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి, కాంగ్రెసు అభ్యర్థి వెంకటరమణకు మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగింది. తెలంగాణలోని పరకాల శాసనసభా నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆధిక్యంలో కొనసాగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖ తెరాసకు సవాల్ విసురుతున్నారు.
నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి, కాంగ్రెసు అభ్యర్థి టి. సుబ్బిరామిరెడ్డిపై లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఉప ఎన్నికల్లో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హవా కొనసాగింది. ఈ నెల 12వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. శుక్రవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 18 శాసనసభా నియోజకవర్గాలకు, ఓ లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధిక స్థానాలు గెలుస్తుందనే అంచనాలు సాగుతున్నాయి.