నేడే అంతరిక్షంలోకి విక్రమ్ 1 ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్: అరుదైన డైమండ్ లోటస్
దేశ అంతరిక్ష వ్యవస్థలో నూతన అధ్యాయం మొదలుకానుంది. మొట్టమొదటిసారిగాప్రైవేట్ భాగస్వామ్యంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్కు చెందిన ప్రముఖ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ దీన్ని రూపొందించింది. ఈ ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోటలో గల షార్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది.
షార్ మొదటి లాంచ్ ప్యాడ్ నుండి ఈ చారిత్రాత్మక ప్రయోగం జరగనుంది. మిషన్ ఆగమనం పేరుతో చేపట్టిన ఈ ప్రయోగాన్ని స్కైరూట్ ఏరోస్పేస్ అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు. భవిష్యత్తులో తక్కువ ఖర్చుతో చిన్న తరహా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి సులభంగా పంపడానికి విక్రమ్ 1 ప్రయోగం బాటలు వేస్తుందనే అంచనాలు ఉన్నాయి.

ఈ మిషన్ ద్వారా రాకెట్ లోని అత్యాధునిక ఇంజిన్లు, పేలోడ్ వ్యవస్థల పనితీరును పరీక్షించనున్నారు. ప్రయాణ సమయంలో సేకరించే ఈ సమాచారం, రాకెట్ పంపించే పూర్తిస్థాయి డేటా ఆధారంగా స్కైరూట్ కంపెనీ తదుపరి భారీ ప్రాజెక్టులను చేపట్టే అవకాశం ఉంది. దేశ అంతరిక్ష పరిశోధనల పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ స్మారకార్థం స్కైరూట్ సంస్థ ఈ రాకెట్ సిరీస్కు విక్రమ్ అని పేరు పెట్టింది. 2022 నవంబర్ లో మిషన్ ప్రారంభ్ కింద విక్రమ్-ఎస్ అనే సబ్ ఆర్బిటాల్ రాకెట్ను విజయవంతంగా పరీక్షించిందీ సంస్థ.
ఆ ప్రయోగంతో దేశంలో సొంతంగా రాకెట్ తయారు చేసి ప్రయోగించిన మొట్టమొదటి ప్రైవేట్ స్టార్టప్ కంపెనీగా స్కైరూట్ రికార్డు సృష్టించింది. నాటి స్ఫూర్తితో ఇప్పుడు పూర్తి స్థాయి ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చే విక్రమ్ 1 రాకెట్ను సిద్ధం చేసింది. మిషన్ ఆగమనం విజయవంతమైతే అంతర్జాతీయ వాణిజ్య అంతరిక్ష ప్రయోగాల దేశాల సరసన భారత్ చేరుతుంది. తక్కువ పెట్టుబడితో ఉపగ్రహాలను అంతరిక్ష భూకక్ష్యలోకి పంపాలనుకునే విదేశీ సాంకేతిక సంస్థలకు భారత్ ఒక ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించినట్టవుతుంది. ఈ మిషన్ విజయవంతమైతే, అంతరిక్ష పరిశోధనలలో ప్రైవేట్ భాగస్వామ్యం నూతన శిఖరాలను అందుకుంటుంది.
A historic new frontier for India’s space journey!
— Narendra Modi (@narendramodi) July 18, 2026
At 11:30 AM today, Skyroot Aerospace will undertake the maiden orbital launch of Vikram-1, India’s first privately developed launch vehicle.
This four-stage rocket is designed to provide rapid and on-demand launch services.… pic.twitter.com/1qFVTwNOuZ
ఈ ప్రయోగం నేపథ్యంలో స్కైరూట్ సంస్థకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశీయ రాకెట్ నిర్మాణ సామర్థ్యంలో ఇదొక ఐతిహాసిక ఘట్టమని అభివర్ణించారు. విక్రమ్ 1 ప్రయోగం అంతరిక్ష పయనంలో నవశకానికి నాంది పలికిందని ప్రశంసించారు. ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్ కూడా స్కైరూట్ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రయోగం.. దేశ ప్రైవేట్ రాకెట్ నిర్మాణ సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అత్యంత ఆధునిక డిజైన్తో తయారైందీ విక్రమ్ 1 రాకెట్. తేలికపాటి కార్బన్ కాంపోజిట్ పదార్థంతో తయారు చేశారు. దీని బరువు చాలా తక్కువగా ఉంటుంది. మొత్తం నాలుగు దశల్లో రాకెట్ పని చేస్తుంది. మొదటి మూడు దశలు ఘన ఇంధన ఆధారంగా, నాలుగో దశ ద్రవ ఇంధన ఆధారిత ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్తో విడివడుతుంది. ఆన్-డిమాండ్ రాకెట్ ప్రయోగానికి అనుగుణంగా ఇది రూపాంతరం చెందింది.
సుమారు 350 కిలోల వరకు బరువున్న పేలోడ్లను మోసుకెళ్లనుంది. భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో గల ఆర్బిట్ లో వీటిని చేరవేస్తుంది. ఈ మిషన్ మోసుకెళ్తున్న పేలోడ్లలో బెంగళూరుకు చెందిన కాస్మోస్ డైమండ్స్ ల్యాబ్లో కృత్రిమంగా అభివృద్ధి చేసిన అత్యంత ఆకర్షణీయమైన డైమండ్ లోటస్ ప్రత్యేక ఆకర్షణ.














Click it and Unblock the Notifications