సిటీలో భారీ వర్షం: హెటెక్ సిటీ వెళ్లే టెక్కీల ఇబ్బందులు
లక్డీకాపూల్, ఖైరతాబాద్, చాదర్ఘాట్, అమీర్పేట తదితర ప్రాంతాలలో రోడ్ల పైకి నీరు వచ్చింది. దీంతో హైటెక్ సిటి, మాదాపూర్ వెళ్లాల్సిన సాఫ్టువేర్ ఇంజనీర్లు ఇబ్బందులకు గురయ్యారు. ఆయా ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. దీంతో కార్యాలయాలకు ఆలస్యంగా చేరుకున్నారు. హైటెక్ సిటీ రైల్వే బ్రిడ్జి వద్ద నీరు ఏరులా పారుతోంది. ప్రతి వర్షాకాలంలో పరిస్థితి ఇలాగే ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోక పోవడంపై స్థానికులు, ప్రయాణీకులు మండిపడుతున్నారు.
నగర కూడళ్లలో నీరు నిలిచి పోవడంతో పలు ప్రాంతాలలో జన జీవనం స్తంభించి పోయింది. వర్షాకాలం వస్తుందని తెలిసినా అధికారులు రహదారులు మరమ్మతులపై దృష్టి సారించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి మరమ్మతులు కావాల్సిన చోట వెంటనే చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ రాయలసీమ, తెలంగాణల మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు ఆదివారం రాష్ట్రంలో పూర్తిగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావం వల్ల కోస్తాంధ్ర, తెలంగాణల్లో పలుచోట్ల... రాయలసీమలో కొన్ని చోట్ల వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశమున్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.