నరేంద్ర మోడీ టార్గెట్: నితీష్ కుమార్ తాపత్రయమేంటి?

ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ తెర పైకి జోరుగా వస్తున్న నేపథ్యంలో నితీష్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మొదట ఎన్డీయే నుండి ప్రధాని రేసులో మోడీతో పాటు నితీష్ కుమార్ పేరు కూడా వినిపించింది. అయితే ఆ తర్వాత క్రమంగా నితీష్ పేరు తెరమరుగై.. మోడీ అభ్యర్థిత్వంపై ప్రచారం జరిగింది. నితీష్ మోడీని టార్గెట్ చేసుకోవడానికి ఇది కూడా ఓ కారణం కావొచ్చని అంటున్నారు.
నిన్నటి వరకు ప్రధాని రేసులో ఉన్న తన పేరు తాజాగా వినిపించక పోవడంతో 2014 నాటికి ఎన్డీయే అభ్యర్థిగా మోడీని తప్పించాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు. భవిష్యత్తులో మోడీ పోటీకి రాకుండా చేయడానికే ఆయన లౌకికవాదం అంటూ తెర పైకి తీసుకు వచ్చారని భావిస్తున్నారు. మోడీ గుజరాత్ను అభివృద్ధి చేశారు. ఆయన పాలనలో కుల, మతాలకు అతీతంగా అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి.
అయితే ఇంత చేస్తున్నప్పటికీ ఆయనకు అంటుకున్న గోద్రా అల్లర్ల మరక మాత్రం తుడుచుకు పోవడం లేదని అంటున్నారు. దానిని ఇప్పుడు నితీష్ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ఆయుధంగా ఉపయోగిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మోడీతో నితీష్ గతంలోనే విభేదించారు. గత బీహార్ సాధారణ ఎన్నికలలో మోడీ ప్రచారానికి ఆయన నో చెప్పారు. మోడీ రావాల్సిన అవసరం లేదని బిజెపికి ముక్కుసూటిగా చెప్పేశారు.
మోడీని నితీష్ ప్రధాని అభ్యర్థిగా తెరపైకి వచ్చినప్పుడు మాత్రమే వ్యతిరేకించడం లేదని, గతంలో కూడా వ్యతిరేకించారని మరికొందరు అంటున్నారు. అయితే గతంలోనే వ్యతిరేకించిన దానికి ఇప్పటికీ తేడా ఉందని మరికొందరు చెబుతున్నారు. తన రాష్ట్రానికి రావడానికి మోడీకి నితీష్ నో చెప్పడం మాట అటుంచితే.. హిందుత్వ ముద్రతో ప్రధాని పదవికి అర్హుడు కాదని చెప్పడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అదే హిందుత్వ ముద్ర పడిన బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ అభ్యర్థిత్వాన్ని 2009లో నితీష్ ఎందుకు సమర్థించారని ప్రశ్నిస్తున్నారు. అద్వానీని సమర్థించిన నితీష్.. మోడీని వ్యతిరేకించడం వెనుక 2014 ఎన్నికలలో తనకు పోటీ రాకూడదనే ఉద్దేశ్యంతోనే అని చెబుతున్నారు. ఇంకో విషయం మోడీని ఎన్డీయేలోని జెడి(యు) వంటి పార్టీలు ప్రధాని అభ్యర్థిగా వ్యతిరేకిస్తుండగా.. నితీష్ ప్రధాని అభ్యర్థి అయితే ఎన్డీయేతర పక్షాలు కూడా కొన్ని ఆయనను సమర్థించే అవకాశముంది. ఈ బలం కారణంగానే నితీష్.. మోడీని టార్గెట్ చేసుకుంటున్నారని అంటున్నారు.
మోడీని నితీష్ టార్గెట్ చేయడం వెనుక 2014 ప్రధాని పీఠం మొదటి కారణమైతే రెండో కారణం లౌకికవాద ముద్ర అని అంటున్నారు. బిజెపితో పాటు ఆ పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీయేలోని పలు పార్టీలకు హిందుత్వవాద ముద్ర ఉంది. బీహార్ ఎన్నికల సమయంలోనే నితీష్.. మోడిని రావొద్దని చెప్పడం ద్వారా లౌకికవాదిగా ముద్రపడ్డారు. బిజెపితో పొత్తు పెట్టుకున్న ఆయన అక్కడ ఘన విజయం సాధించారు.
తాను ఎన్డీయేలో ఉన్నప్పటికీ లౌకికవాదమే తన నినాదం అని నితీష్ పరోక్షంగా చెప్పేందుకు మోడీని మళ్లీ టార్గెట్ చేసి ఉంటారని అంటున్నారు. మరోవైపు నరేంద్ర మోడీకి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), భారతీయ జనతా పార్టీ మాత్రం అండగా నిలుస్తున్నాయి.












Click it and Unblock the Notifications