జగన్ పార్టీకి బొత్స కౌంటర్, మార్పు ఉండదు... ఆజాద్

కాగా జగన్ని అవినీతిపరుడంటూనే.. ఆయనకు మేళ్లు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని మంచోడన్నంత కాలం కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించరని బొత్సకు తాజా ఉప ఎన్నికల్లో శాసనసభా నియోజకవర్గ సమన్వయకర్తలు స్పష్టం చేశారు. నష్ట నివారణ చర్యలు తీసుకోకుంటే పార్టీ తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు. గాంధీభవన్లో గురువారం బొత్స వీరితో సమావేశమై ఉప ఎన్నికల ఫలితాలపై సమీక్షించారు.
దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న దళితులు, మైనారీటీలు, గిరిజనులు దూరమయ్యారని.. రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు జగన్ పార్టీ వైపు వెళ్లారని సమన్వయకర్తలు బొత్సకు వివరించారు. ముస్లిం రిజర్వేషన్లపై సరిగ్గా ఎన్నికలకు ముందే హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా పార్టీ అభ్యర్థులకు నష్టం చేకూర్చిందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలన్ని వైయస్ ప్రారంభించినవేనని.. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేస్తుందంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ప్రచారం కూడా బాగానే ప్రభావం చూపిందన్నారు.
అనంతపురం, రాయదుర్గం, రాయచోటి అభ్యర్థుల ఎంపిక వల్ల పార్టీకి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో పోలీసు అధికారుల వైఖరి కూడా పార్టీకి తీవ్రనష్టం చేకూర్చిందంటూ రైల్వే కోడూరు ఘటనను ఉదహరించారు. తిరుపతిలో చిరంజీవి రాజీనామా పట్ల ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని.. దీనికి తోడు, అక్కడ పోటీ పడ్డ కాంగ్రెస్, టిడిపి అభ్యర్థుల సామాజిక వర్గాలు ఒక్కటే కావడం కూడా నష్టాన్ని కలిగించిందని విశ్లేషించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ ఉర్దూలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని.. దాని ప్రభావం కూడా ఓటర్లపై పడిందన్నారు.
సోనియా గాంధీ విధేయులను, పార్టీ విధేయులను వైయస్ రాజకీయంగా అథఃపోతాళానికి తొక్కేశారని పలువురు విమర్శించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ను బలహీనం చేసే వ్యూహం పన్నిన వైయస్ను వదిలేయకుంటే కష్టమేనని అభిప్రాయపడ్డారు. తాను చాలా మంది మంత్రులు, ఇతర నేతల ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ వైయస్ నిలువెత్తు ఫోటోలను చూశానని, ఆశ్చర్యం ఏమిటంటే.. ఆ గదుల్లో ఎక్కడా సోనియా, మన్మోహన్, రాహుల్ గాంధీ, కిరణ్ కుమార్ రెడ్డి ఫోటోలు లేవని మరో సీనియర్ నాయకుడు అన్నారని తెలుస్తోంది. పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని తగ్గించేందుకు నామినేటెడ్పదవులు భర్తీ చేయాలని పలువురు సమన్వయకర్తలు సూచించారు.
మరోవైపు రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండబోదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 2014 వరకు ఎలాంటి ఢోకా లేదన్నారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తాత్కాలికమేనని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications