రాష్ట్రపతి ఎన్నికల తర్వాత భారీ మార్పులు: రాయపాటి
ఉప ఎన్నికల్లో సానుభూతితోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ గెలిచారని, 2014లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్ర పార్టీపై అధిష్ఠానానికి అసంతృప్తి ఉందని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల తరువాత రాష్ట్రంలో మార్పులు జరిగే అవకాశం ఉందన్నారు. పార్టీ ఎందుకు ఇంత ఘోరంగా ఓడిందన్నదానిపై విశ్లేషణ జరగాలన్నారు.
తాను, తన సోదరుడు కలిసి ప్రత్తిపాడు నియోజకవర్గంపై సమీక్ష జరపనున్నట్లు తెలిపారు. కాగా, దుర్గమ్మను దర్శించుకున్న రాయపాటి విమానగోపురం మరమ్మతులకోసం కిలో బంగారాన్ని విరాళంగా ఇస్తానని ఈవో రఘునాథ్కు తెలిపారు.
పార్టీ కోసం మంత్రులు పనిచేయాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెసు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని పార్టీని, ప్రభుత్వాన్ని సమూలంగా ప్రక్షాళన చేయక తప్పదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అవినీతి మంత్రులను తొలగించాలా, వద్దా అనే విషయంపై ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.
ఉప ఎన్నికల ఫలితాలపై కింది స్థాయి నుంచి అరమరికలు లేకుండా చర్చించుకోవాలని, ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ప్రక్షాళన తప్పదని ఆయన అన్నారు.