బాబు ధర్నా వద్దకు లగడపాటి, ఉద్రిక్తత: ఫ్లైట్లో భేటీకి..
శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ.. చంద్రబాబు గల్లీ లీడర్లను నమ్ముకొని పరువు తీసుకున్నారని అన్నారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసమే మహాధర్నా చేపట్టారని లగడపాటి ఆరోపించారు. దమ్ముంటే ఆరు నెలల్లో ఫ్లై ఓవర్ నిర్మించాలని తాను బ్లాంక్ చెక్కులు రాసిస్తానని ఆయన చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు పూర్తయ్యాక ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు చేపడతామని చెప్పారు.
గల్లీ లీడర్ల మాటలు నమ్మి బాబు ధర్నాకు దిగడం తనకు నవ్వు తెప్పించడమే కాక ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఫ్లై ఓవర్ సాధ్యం కాదని తెలిసినా బాబు ఇలా చేయడం సరికాదన్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణం అంటూ రాజకీయ కుట్రకు వ్యతిరేకంగా అభివృద్ధిపై సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన బాబు విజయవాడ అభివృద్ధికి ఏనాడూ కృషి చేయలేదని మండిపడ్డారు.
కాంగ్రెసు హయాంలోనే విజయవాడ అభివృద్ధి జరిగిందన్నారు. కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా ఫ్లై ఓవర్ అంశాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఫ్లై ఓవర్ నిర్మిస్తానంటే తానే నిధులు సమకూరుస్తానని చెప్పారు. చంద్రబాబును ఎలాగైనా కలిసి నిర్మాణంలోని అడ్డుంకులు వివరిస్తానని చెప్పారు. సూర్యుడి అస్తమించేలోగా ఆయనను కలుస్తానని, కుదరకపోతే ఫ్లైట్లోనైనా కలుస్తానని చెప్పారు.
కాగా లగడపాటి ఆ తర్వాత చంద్రబాబును కలిసేందుకు మహాధర్నా వేదిక వద్దకు 108 వాహనంలో బయలుదేరగా పోలీసులు ఆయనను అశోక స్తంభం సెంటరులో అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. మరోవైపు చంద్రబాబును ఎలాగైనా కలుస్తానని చెప్పిన లగడపాటి విజయవాడ నుండి హైదరాబాదు వెళ్లే అన్ని ఫ్లైట్ టిక్కెట్స్ను బుక్ చేశారని సమాచారం. బాబు ఏ విమానంలో హైదరాబాదు వెళితే అదే విమానంలో ఎక్కి అతనికి ఫ్లై ఓవర్ గురించి వివరించేందుకు ఆయన ఫ్లైట్ టిక్కెట్స్ అన్నీ బుక్ చేశారని తెలుస్తోంది.
కాగా మహాధర్నా వద్ద వర్ల రామయ్య, ఎర్రన్నాయుడు మాట్లాడారు. లగడపాటి డబ్బున్న వివేకి అని వర్ల మండిపడ్డారు. ప్రజా సమస్యలు ఆయనకు ఏమాత్రం పట్టవన్నారు. లగడపాటిని రెండుసార్లు ఎంపీగా గెలిపించినప్పటికీ ఆయన ప్రజా సమస్యలు పట్టించుకున్న దాఖలాలు లేవని మరో నేత ఎర్రన్నాయుడు మండిపడ్డారు. చంద్రబాబు దీక్షా శిబిరానికి చేరుకొని మహాధర్నాలో పాల్గొన్నారు.