పురంధేశ్వరికి రిలీఫ్: '14లోనూ మేకపాటి పైనే టిఎస్సార్!
ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసిన టిఎస్సార్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి చేతిలో దాదాపు రెండు లక్షల తొంబై ఒక్క వేల పై చిలుకు ఓట్లతో ఓటమి చవి చూశారు. విశాఖపట్నం నుండి పురంధేశ్వరికి ముందు టిఎస్సార్ ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత కొన్ని సమీకరణాల నేపథ్యంలో అధిష్టానం విశాఖ నుండి పురంధేశ్వరిని బరిలోకి దింపింది. దాంతో అతని నియోజకవర్గం మారిపోయింది.
అయితే గత కొంతకాలంగా టిఎస్సార్ విశాఖపై దృష్టి సారించడం ప్రారంభించారు. తాను వచ్చే ఎన్నికలలో విశాఖ నుండే పోటీ చేస్తానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు పురంధేశ్వరిలో అసంతృప్తిని కలిగించాయి. అయితే ఆయనపై ఏమీ కామెంట్ చేయకుండా టిక్కెట్ ఎవరికి ఇవ్వాలో అధిష్టానం నిర్ణయిస్తుందని, ఎన్నికలకు ఇంకా చాలా సమయముందని ఆమె చెప్పారు. అయితే ఉప ఎన్నికలు పురంధేశ్వరికి మంచి రిలీఫ్ ఇచ్చాయి.
జగన్ పార్టీ పెట్టడం, జిల్లాలో గట్టి నేత అయిన మేకపాటి అటు వైపు వెళ్లడం, రాజీనామా చేయడం తదితర పరిణామాల నేపథ్యంలో అదే జిల్లాకు చెందిన టిఎస్సార్ను కాంగ్రెసు అధిష్టానం నెల్లూరు లోకసభ స్థానం నుండి బరిలోకి దింపింది. అయితే ఉప ఎన్నికలలో ఓటమి చెందినప్పటికీ టిఎస్సార్ నెల్లూరు అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారు. వచ్చే ఎన్నికలలో ఇక్కడి నుండి పోటీ చేసేందుకే ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారని అంటున్నారు.
టిఎస్సార్ నెల్లూరు వైపు మొగ్గడంతో పురంధేశ్వరికి వచ్చే ఎన్నికలలో పార్టీ పరంగా అడ్డంకులు తొలగిపోయాయని అంటున్నారు. ఓడినప్పటికీ టిఎస్సార్ ఉప ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. శ్రీకాళహస్తి - నడికుడి రైల్వే లైన్, మెట్టవాసులకు సాగు, తాగునీరు, నెల్లూరులో భూగర్భ డ్రైనేజీ పథకం, వైద్య కళాశాల తదితర సమస్యలను పరిష్కారం చేసే దిశలో ముందుకు పోతున్నారట.