విమర్శల్లో వాస్తవం లేదు: నీటి విడుదలపై సుదర్శన్ రెడ్డి
ఏటా జూన్ 25వ తేదీకి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయడం ఆనవాయితీ అని, ఈసారి ఐదు రోజులు ఆలస్యంగానైనా రైతు ప్రయోజనాలను దృష్టి పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. హైదరాబాదు, నల్లగొండ జిల్లాలకు మరో ఐదు నెలలకు సరిపడా మంచినీటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్న తర్వాతనే కృష్ణఆ డెల్టాకు నీరు విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.
కృష్ణా డెల్టాకు నాగార్జున సాగర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజీ నుంచి నీరు విడుదల చేయాలనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాలపై తెలంగాణ నాయకులు తీవ్ర విమర్శలు చేశారుు కృష్ణా బేసిన్ రైతుల ఆందోళన నేపథ్యంలో శుక్రవారం సచివాలయంలో కృష్ణా బేసిన్లోని రిజర్వాయర్ల పరిస్థితిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఇతర అధికారులతో సమీక్షించారు. కృష్ణా డెల్టాకు తక్షణమే నీరు విడుదల చేయాలని నీటి పారుదల శాఖాధికారులను ఆదేశించారు. నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీలలో నీటి మట్టం కనిష్ఠ స్థాయిలో ఉన్నందున నీటి విడుదలను నీటి పారుదల, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ స్థితిలో తెలంగాణ నాయకులు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలనే ముఖ్యమంత్రి నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు మాత్రమే కాకుండా కాంగ్రెసు తెలంగాణ నాయకులు కూడా మండిపడుతున్నారు. తెలంగాణ రైతుల పట్ల ఇది వివక్ష చూపడమేనని వారన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయానికి వ్యతిరేకిస్తూ తెలంగాణకు చెందిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి రాజీనామా చేయాలని తెరాస నాయకుడు హరీష్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూడా వ్యతిరేకించారు.