రాయల తెలంగాణకు జగన్ నో, జగ్గారెడ్డీ వ్యతిరేకత

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలని నిర్ణయిస్తే కచ్చితంగా హైదరాబాద్తో కూడిన తెలంగాణనే ఇవ్వాలని ప్రభుత్వ విప్ టి. జగ్గారెడ్డి కోరారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతోమాట్లాడారు. తెలంగాణ మూడు నెలల్లోగా వస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రకటించడం అర్థరహితమని ఆయన అన్నారు. కేంద్రం, రాష్ట్రంలో అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నందునే రాష్ట్ర విభజన అంశంలో జాప్యం జరుగుతోందన్నారు.
తెలంగాణ ఏర్పాటు చేయడం కెసిఆర్ అనుకున్నంత తేలిక కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ను అంతర్గతంగా, బహిర్గతంగా బలహీనపరిచి తెలంగాణలో తానొక్కడినేనని నిరూపించుకునేందుకు కెసిఆర్ తాపత్రయవడుతున్నారని విమర్శించారు. 2014లో జరిగే ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు కెసిఆర్ కుట్రపన్నుతున్నారని ఘాటుగా విమర్శించారు.
ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు కలిపిన తెలంగాణ ప్రాంత విముక్తే ధ్యేయంగా తెరాస పోరాడుతుందని, రాయల తెలంగాణను అంగీకరించేది లేదని ఆ పార్టీ శాసన సభా పక్షనేత ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణ తెలంగాణ ప్రజలకు సమ్మతం కాదని స్పష్టం చేశారు. తెరాస, ఈ ప్రాంత ప్రజలు నాటి పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారన్నారు.












Click it and Unblock the Notifications