జగన్నెలా ఢీకొందాం, తెలంగాణను అధిగమించాలి: సిఎం

మంత్రి ధర్మాన ప్రసాద రావు కన్వీనర్గా విశ్లేషణ కమిటీ ఏర్పాటైంది. శనివారం ముఖ్యమంత్రి కిరణ్, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ సమక్షంలో విశ్లేషణ కమిటీ తొలి సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా లబ్ధిదారుల నుంచి ఆ స్థాయిలో స్పందన రాకపోవడానికి కారణాలను అన్వేషించాలని కోరారు. వాటిలో మార్పుచేర్పులు అవసరమేమో గుర్తించాలని సూచించారు. కొత్తగా మరిన్ని పథకాలను అమలు చేయాల్సిన అవసరంపై అధ్యయనం చేయాలని కోరారు.
ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలుంటాయని, కానీ, ఆ వ్యతిరేక ఓటు ప్రధాన ప్రతిపక్షం ఖాతాలోకి వెళ్లడం లేదని, తెలంగాణ ప్రాంతంలో సెంటిమెంట్కు, సీమాంధ్రలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వెళుతున్నాయని, ఈ కోణంలో ఆలోచించి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం తగ్గి.. పాజిటివ్ ఓటు పెరిగేందుకు అవసరమయ్యే చర్యలను సూచించడంపై దృష్టి సారించాలని కమిటీకి సీఎం సూచించారు.
కమిటీకి ఎల్లలు, హద్దులు లేవని స్పష్టం చేశారు. 15 రోజుల్లో ప్రాథమిక నివేదికను ఇవ్వాలని సిఎం కోరారు. సెప్టెంబర్ 15లోగా వివిధ జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తానని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలన్నారు. ఇటీవలి ఉప ఎన్నికల్లో ఆర్థికంగా.. వ్యూహాత్మకంగా దూకుడును ప్రదర్శించినా ఓటమికి కారణాలేమిటో విశ్లేషించాలని సూచించారు.
పార్టీకి దూరమైన వర్గాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని బొత్స స్పష్టం చేశారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఏయే వర్గాలు పార్టీకి దూరమయ్యాయో.. ఎందుకు దూరమయ్యాయో పరిశీలించాలని అన్నారు. త్వరలోనే డిసిసి, పిసిసి కార్యవర్గాన్ని ప్రకటిస్తామని చెప్పారు. పార్టీలో కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటే వాటిని వివరించాలని ధర్మాన కమిటీకి సూచించారు.












Click it and Unblock the Notifications