మీడియాకేం సంబంధం: సిబిఐ జెడిపై హైకోర్టు సీరియస్

మీడియాతో జెడి ఫోన్లపై భవనం భూషణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ స్వీకరించిన కోర్టు సిబిఐ జెడికి నోటీసులు జారీ చేసింది. కాగా మీడియాతో మాట్లాడలేదని కోర్టును తప్పుదోవ పట్టించిన సిబిఐ జెడి లక్ష్మీ నారాయణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు జిల్లాకు చెందిన భూషణ్ బి.భవనం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే. సిబిఐ జెడి ఫోన్ నుంచి వెళ్లిన, ఆయన ఫోన్కు వచ్చిన కాల్స్, ఎస్సెమ్మెస్ల వివరాలను సమర్పించేలా బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ను ఆదేశించాలంటూ ఆయన హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఇందులో కేంద్ర హోం శాఖ కార్యదర్శి, సిబిఐ జాయింట్ డెరైక్టర్, ఈనాడు అధిపతి రామోజీరావు, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ, బిఎస్ఎన్ఎల్ జీఎంలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అంతేకాక ఈ వ్యాజ్యంలో జెడి లక్ష్మీనారాయణను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. లక్ష్మీనారాయణ మీడియా ప్రతినిధులతో మాట్లాడినట్లు ఆయన కాల్ లిస్టే స్పష్టంగా చెబుతోందని, ఇలా దర్యాప్తునకు సంబంధించిన అంశాలపై మీడియాతో మాట్లాడటం సిబిఐ మాన్యువల్కు విరుద్ధమని, ఇది అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని ఆయన పిల్లో వివరించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రతినిధులకు, జెడి లక్ష్మీనారాయణకు మధ్య అసాధారణ సంఖ్యలో కాల్స్, ఎస్ఎంఎస్లు నడిచాయని, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటపడ్డాయని తెలిపారు.
జెడి కాల్లిస్ట్ ద్వారా చంద్రబాల అనే మహిళకు సైతం పెద్ద సంఖ్యలో కాల్స్, ఎస్ఎంఎస్లు పంపినట్లు కూడా తేలిందన్నారు.
ఆమె కూడా లక్ష్మీనారాయణకు అదే స్థాయిలో కాల్స్, ఎస్ఎంఎస్లు పంపారని వివరించారు. దీనిపై పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు కూడా వచ్చాయని, ఆ మరుసటి రోజు చంద్రబాల ఆంధ్రజ్యోతి ఛానెల్కు వచ్చి లక్ష్మీనారాయణకు, తనకు మధ్య జరిగిన సంభాషణలు పూర్తిగా ప్రైవేటు వ్యవహారమని, దానిని ప్రశ్నించేందుకు ఎవరికి అధికారం లేదని కూడా చెప్పారని పిటిషనర్ పేర్కొన్నారు. సిబిఐ మాన్యువల్ ప్రకారం మీడియాతో మాట్లాడే అధికారం జెడి లక్ష్మీనారాయణకు లేదని, కేసు దర్యాప్తు గురించి ఉన్నతాధికారులతో తప్ప మరెవ్వరితోనూ మాట్లాడకూడదని పిటిషనర్ తెలిపారు.












Click it and Unblock the Notifications