తెలంగాణ ఇష్యూ: పాల్వాయికి రాహుల్ పిలుపు

రాహుల్ గాంధీ ఆహ్వానం మేరకు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి రేపు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ తెలంగాణ ప్రాంతానికే చెందిన రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావుతో చర్చలు జరిపారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావుతో కూడా ఆయన మాట్లాడారు. తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుక్కునే దిశగా చేస్తున్న ఆలోచనలో భాగంగానే రాహుల్ గాంధీ ఈ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో వైయస్ జగన్ ప్రాబల్యానికి అడ్డుకట్టే విషయంపై కూడా రాహుల్ గాంధీ రాష్ట్రానికి చందిన నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అంశంపై, జగన్ ప్రాబల్యాన్ని తగ్గించే విషయంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. తాజాగా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారం ఢిల్లీ వెళ్లారు. ఆయన అధిష్టానానికి చెందిన పలువురు నాయకులతో సమావేశమవుతున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకటిస్తుందని అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ విజయం దాదాపు ఖాయమైనట్లే భావిస్తున్నారు. దీంతో తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రానికి చెందిన మిగతా పార్టీలు తెలంగాణపై కాంగ్రెసు నిర్ణయం కోసం వేచి చూస్తున్నాయని, కాంగ్రెసు నిర్ణయం వెలువరిస్తే మిగతా రాజకీయ పార్టీలు కూడా తమ నిర్ణయాలను వెల్లడించే అవకాశాలున్నాయని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అంశాన్ని నాన్చకూడదని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు.
సోనీయా గాంధీ, రాహుల్ గాంధీ రాష్ట్ర పరిస్థితులపై దృష్టి సారించారని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికే రాష్ట్రానికి చెందిన కొంత మంది పార్లమెంటు సభ్యులతో చర్చించారు. ఇప్పుడు ఆ చర్చల కోసమే పాల్వాయి గోవర్ధన్ రెడ్డిని ఢిల్లీకి ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications