తెలంగాణ ఎజెండా: జైపాల్ రెడ్డితో లగడపాటి భేటీ
తెలంగాణ రాదని, సమైక్యాంధ్రనే కేంద్రం ప్రకటిస్తుందని లగడపాటి రాజగోపాల్ గురువారం మరోసారి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును లగడపాటి రాజగోపాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ స్థితిలో లగడపాటి జైపాల్ రెడ్డితో ఏం మాట్లాడారనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ అంశంపై జైపాల్ రెడ్డి బయటకు ఏమీ మాట్లాడకపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే తన అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం.
ఇదిలా వుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రేపు శుక్రవారం ఢిల్లీకి వస్తున్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునేందుకు జరుగుతున్న కసరత్తులో భాగంగానే పార్టీ అధిష్టానం వారిని ఢిల్లీకి ఆహ్వానించినట్లు చెబుతున్నారు. పార్టీ అధిష్టానం గత కొద్దిరోజులుగా రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకులతో తెలంగాణ అంశంపై చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. సోనియా కూడా మూడు ప్రాంతాల నాయకుల అభిప్రాయాలను విన్నారు. రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్ కూడా పార్టీ నాయకుల అభిప్రాయాలు సేకరించారు.
తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి చిదంబరం ఇటీవల చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు అభిప్రాయం కోసం రాష్ట్రానికి చెందిన ఇతర పార్టీలు ఎదురు చూస్తున్నాయని, కాంగ్రెసు అభిప్రాయం ప్రకటించిన తర్వాత తమ అభిప్రాయం చెప్పాలనే ఉద్దేశంతో ఆ పార్టీలు ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. దీంతో ఇతర పార్టీలను పక్కన పెట్టేసి తమ నిర్ణయాన్ని ప్రకటించాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాయల తెలంగాణ అంశం మరోసారి తెర మీదికి వచ్చింది. అయితే, రాయలసీమకు చెందిన నాయకులు చాలా మంది ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ నాయకులు కూడా దానికి అంగీకరించడం లేదు.