అమరావతి కేంద్రంగా కీలక మార్పులు, ఇక నుంచి..!!
అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిర్మాణాల ప్రక్రియ ఊపందుకుంది. ఆర్దికంగా ఇబ్బందులు లేకుండా కేంద్ర సాయంతో రుణ సమీకరణ చేస్తున్నారు. రెండో విడత భూ సమీకరణ కొనసాగుతోంది. ఇదే సమయంలో పాలనా పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. కీలక మార్పులు చేసారు. ప్రత్యేక అధికారులను నియమించి బాధ్యతలు కేటాయిస్తున్నారు. 2028 నాటికి నిర్మాణాలతో పాటుగా రాజధాని లక్ష్యంగా ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తున్నారు.
అమరావతి కేంద్రంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి పరిపాలనలో మార్పులు చేశారు. కొత్త కమిషనర్ విజయరామరాజు వచ్చిన తరువాత మొత్తం రాజధాని ప్రాంతాన్ని గ్రిడ్లుగా మార్చి తొమ్మిది జోన్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు మే 26న కమిషనర్ విజయరామరాజు అధికారిక ఆదేశాలు జారీ చేశారు. పరిపాలనా పరమైన సౌలభ్యం కోసం అధికారులను, సిఆర్డిఎలో ల్యాండ్ పూలింగు యూనిట్లను విభజిస్తూ సిసిఎల్ఎకు, గ్రామ, వార్డు సచివాలయ విభాగాలకు మే నాలుగో తేదీన లేఖ రాశారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి అనుమతి రాగానే ఇటీవల రాజధాని అమరావతి ప్రాంతం మొత్తాన్ని తొమ్మిది జోన్లుగా మార్చారు. దీనిలో ప్రస్తుత ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తున్న కొండమరాజుపాలెం రెవెన్యూను సెంట్రల్ జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈస్ట్ జోన్ పరిధిలోకి కృష్ణాయపాలెం, పెనుమాక, ఈస్ట్ సెంట్రల్ జోన్ పరిధిలోకి ఐనవోలు, నార్త్ ఈస్ట్ జోన్లోకి లింగాయపాలెం, ఉండవల్లి, వెంకటపాలెం, నార్త్ ఈస్ట్ సెంట్రల్ జోన్ పరిధిలోకి మల్కాపురం, ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, మందడం రెండు యూనిట్లు తీసుకొచ్చారు.

అమరావతిలో ఇక నుంచి కొత్తగా
అదే విధంగా నార్త్ వెస్ట్ జోన్ పరిధిలో అబ్బురాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, సౌత్ ఈస్ట్లోకి నవులూరు 1, 2 యూనిట్లు, సౌత్ ఈస్ట్ సెంట్రల్ జోన్ పరిధిలోకి కురగల్లు రెండు యూనిట్లు, నిడమర్రు రెండు యూనిట్లు కలిపారు. వెస్ట్ సెంట్రల్ జోన్ పరిధిలోకి నెక్కల్లు, నేలపాడు, శాఖమూరు, తుల్లూరు రెండు యూనిట్లు, అనంతవరం గ్రామాలను తీసుకొచ్చారు. అలాగే రెండోదశలో ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్గా ఏర్పాటు చేయడంతోపాటు సిబ్బందిని నియమించారు.భూమి విస్తీర్ణం ఆధారంగా కొన్ని గ్రామాల్లో అదనపు సర్వేయర్లను నియమించారు. ఇవికాకుండా రాజధాని నగరంలో ల్యాండ్స్ విభాగానికి ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేశారు. దీనిలోనూ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ తోపాటు పది మందిని నియమించారు. అలాగే ఎపిసిఆర్డిఎ కోసం ప్రత్యేక ల్యాండ్ యూనిట్ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ గ్రామాల్లో కాంపిటెంట్ అథారిటీలే అన్ని వ్యవహారాలు చూసేవారు. ఇక నుండి జోనల్ స్థాయిలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఆయా జోన్ల పరిధిలోకి వచ్చే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాల్సి ఉంటుంది. భూ యజమానులు నేరుగా సిఆర్డిఎ కార్యాలయానికి వెళ్లకుండా ఆయా జోన్ల పరిధిలోని సమస్యలు పరిష్కరించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications