శరద్ పవార్కు విజయమ్మ విజ్ఞప్తి: మీడియా గెంటివేత
కృషి భవనంలో వైయస్ విజయమ్మ, పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు పవార్ను కలుసుకున్నారు. మరోవైపు వైయస్ విజయమ్మ, పవార్ భేటీని కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియాను మంత్రి కార్యాలయ సిబ్బంది అడ్డుకుంది. తొలుత కవరేజ్ కోసం మీడియాకు అనుమతిచ్చారు. అయితే భేటీ సమయంలో అనుమతి లేదంటూ మీడియాను వెళ్లిపొమ్మన్నారు. దీంతో మీడియా సిబ్బంది అక్కడే ఆందోళనకు దిగింది.
దీంతో పవార్ అడిషనల్ పిఏ మీడియాను బయటకు గెంటి వేయించారని సమాచారం. ఈ ఘటనపై మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. కార్యాలయ సిబ్బంది వైఖరిని మీడియా ప్రతినిధులు ప్రతిఘటించారు. పరిస్థితిలు ఉద్రిక్తతకు దారి తీసే విధంగా ఉండటంతో స్వయంగా పవార్ వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. సర్దుకు పోవాలని మీడియాకు చెప్పి వెళ్లిపోయారు. పవార్ను కలిసిన వారిలో విజయమ్మతో పాటు శోభా నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.
కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు మైసూరా రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోసులు కేంద్రమంత్రి సుల్తాన్ అహ్మద్తో భేటీ అయ్యారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ కక్షపూరితంగా దర్యాఫ్తు చేస్తోందని సుల్తాన్కు వివరించినట్లు మేకపాటి భేటీ అనంతరం చెప్పారు. తాము ఇచ్చిన వివరాలను మమతా బెనర్జీకి అందిస్తామని చెప్పారు, తృణమూల్ మద్దతు జగన్కు ఉంటుందని చెప్పారన్నారు.
విజయమ్మ ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆమె ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఎన్డీయే కన్వీనర్ శరద్ యాదవ్, ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్తో భేటీ అయ్యారు. సాయంత్రం ఐదు గంటలకు సివిసి ప్రదీప్ కుమార్ను కలవనున్నారు. జగన్ ఏ తప్పు చేయలేదని కొవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హైదరాబాదులో జగన్ను జైలులో కలిసిన అనంతరం అన్నారు.
జగన్ నిర్దోషిగా బయటకు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్కు న్యాయస్థానాల పైన పూర్తి నమ్మకం ఉందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడి అరెస్టు వెనుక కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల కుట్ర ఉందన్నారు. జెడి కాల్ లిస్టుపై ప్రభుత్వం ఎందుకు విచారణ జరపటం లేదని ప్రశ్నించారు. జగన్ సింహం లాంటి వ్యక్తి అన్నారు. సింహం బోనులో ఉన్నా బయట ఉన్నా ఒకటే అని చెప్పారు.