సిబిఐకి సూరీడు హ్యాండ్: జగన్కు బెయిల్ నిరాకరణ!
ఇటీవల జగన్ బెయిల్ పిటిషన్ పైన వాదనలు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ వాదనల సందర్భంగా జగన్కు బెయిల్ ఇవ్వవద్దంటూ వాదించిన సిబిఐ అందుకు బలమైన ఆధారాన్ని సమర్పించింది. ఆ తర్వాత శుక్రవారం కోర్టు బెయిల్ నిరాకరిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే జగన్కు బెయిల్ వద్దంటూ వాదించిన సిబిఐ... సాక్ష్యులను ప్రభావితం చేస్తారని, బెయిల్ ఇవ్వవద్దని చెబుతూ, సూరీడు విషయాన్ని ప్రస్తావించింది.
సూరీడు లాంటి సాక్షులు వెనక్కి తగ్గడానికి కారణాలేంటో న్యాయస్థానమే పరిశీలించాలని సిబిఐ కోర్టును కోరింది. సిబిఐ వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకోవడమే కాదు.. బెయిల్ కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది కూడా. తన ఉత్తర్వుల్లో సూరీడు ఉదంతాన్ని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. బెయిల్ డిస్మిస్ చేస్తూ హైకోర్టు పలు అంశాలు పేర్కొంది.
నిందితునికి బెయిల్ ఇచ్చేముందు సాక్షులను అతను ప్రభావితం చేయగలడా అన్న అంశాన్ని పరిశీలించాలని, దర్యాప్తులో భాగంగా, సాక్షిగా సూరీడు వాంగ్మూలాన్ని సిబిఐ రికార్డు చేసిందని, దర్యాప్తు సంస్థ ఎదుట ఏయే విషయాలను చెప్పానో వాటన్నింటినీ మేజిస్ట్రేట్ ముందు చెబుతానని సిబిఐకి సూరీడు వాగ్దానం చేశాడని దీంతో, తన ఎదుట హాజరు కావాలంటూ ఏప్రిల్ 27న కోర్టు నుంచి సూరీడుకు సమన్లు జారీ అయ్యాయని, కానీ మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చేందుకు సూరీడు నిరాకరించాడని పేర్కొంది.
దీంతో, విచారణ మే 17, 19వ తేదీలకు వాయిదా పడినా.. కోర్టు జారీ చేసిన సమన్లను సిబిఐ సూరీడుకి అందించలేక పోయిందని, సమన్లను తీసుకోవడానికి సూరీడు నిరాకరించాడని, తాను కోర్టులో వాంగ్మూలం ఇచ్చే పరిస్థితిలో లేనని చెప్పాడన్న విషయాన్ని కోర్టుకు సిబిఐ తెలియజేసిందని పేర్కొంది. మే 27న జగన్ను సిబిఐ అరెస్టు చేయగా, అందుకు రెండు రోజుల ముందే సూరీడుకు సంబంధించిన సమన్లు మరోసారి సిబిఐకి అందాయని, వాటిని తీసుకోవడానికి సూరీడు నిరాకరించడంతో ఈ సమన్లను సిబిఐ అధికారులు మే 30వ తేదీన కోర్టుకు తిప్పి పంపారని, ఈ కేసులో సూరీడు కీలక సాక్షి అని, సిబిఐ కార్యాలయానికి వచ్చి చెప్పిన విషయాలన్నిటినీ మేజిస్ట్రేట్ ఎదుట చెబుతానని అతడు హామీ ఇచ్చాడని, ఆ తర్వాత మాట మార్చాడని పేర్కొంది.
సాక్షులను ప్రభావితం చేస్తారనే అంశానికి సంబంధించి ఈ ఉదంతాన్ని ఓ ఉదాహరణగా తీసుకోవాలని సిబిఐ చేసిన వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుందని, ఇతర సాక్షులను కూడా ఇలాగే ప్రభావితం చేసే అవకాశం ఉందని సిబిఐ వాదించిందని, అందుకే, జగన్కు బెయిల్ ఇవ్వవద్దంటూ సిబిఐ చేసిన వాదనను పరిగణనలోకి తీసుకుంటున్నామని కోర్టు తెలిపింది. కేసు తీవ్రత దృష్ట్యా నిందితుడు సాక్ష్యాధారాలను నాశనం చేయవచ్చని, హవాలా మార్గంలో కోట్లాది రూపాయల సొమ్ము జగన్కు సంబంధించిన కంపెనీల్లోకి వచ్చిందన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయడం సమంజసం కాదన్న వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.