గుడివాడపై కన్నేసిన బాలయ్య: నాని జంప్ గుట్టు?
విజయవాడ: నందమూరి హీరో బాలకృష్ణ గుడివాడ శాసనసభా స్థానంపై కన్నేసినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి ఆయన శాసనసభకు పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పుట్టిన గడ్డ కావడంతో ఆయన ఆ స్థానానికి ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడానికి తొలి మెట్టుగా దాన్ని ఆయన భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆ సీటుకు జూనియర్ ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడై కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
బాలకృష్ణకు సంబంధించిన సమాచారం తనకు అందడంతో కొడాలి నాని వచ్చే ఎన్నికల్లో ఆ సీటు తనకు దక్కదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా ఆయన తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయం తీసుకోవడంలో మరో ముఖ్యమైన కారణం ఉందని తెలుస్తోంది. గుడివాడ నియోజకవర్గంలో ఎస్సీల ఓట్లు అధికంగా ఉన్నాయి. వారి మద్దతుతోనే కొడాలి నాని విజయం సాధించారు. ఇప్పుడు వారు తెలుగుదేశం పార్టీకి దూరమైనట్లు తెలుస్తోంది. కోస్తాంధ్రలోని దళితులు, మైనారిటీలు ఎక్కువగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. దాన్ని పసిగట్టిన కొడాలి నాని వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా గెలవడం సాధ్యం కాదనే భావనకు గురయ్యారని అంటున్నారు.
దానికితోడు, జిల్లా రాజకీయాల్లో తనకు ఏ మాత్రం ప్రాధాన్యం లభించడం లేదు. గుడివాడ నియోజకవర్గంలోనే కాకుండా, కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకుల్లో కొడాలి నాని ఒకరు. అయినా, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వరరావు కొడాలి నానిని దూరం పెడుతున్నారని అంటున్నారు. ఇటీవలి కాలంలో కొడాలి నాని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన నిష్క్రమణ తెలుగుదేశం పార్టీ నుంచి అనూహ్యంగా, అకస్మాత్తుగా జరిగిందేమీ కాదు. ఆయన జగన్ పార్టీలోకి వెళ్తారని గత కొద్ది కాలంగా గట్టిగానే వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను కొడాలి నాని పూర్తిగా ఖండించలేదు కూడా.
తన భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. నిజానికి, ముందు చూపుతోనే కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నానికి గుడివాడ సీటు ఇప్పించారని అంటారు. అయితే, తాజగా దానిపై బాలయ్య కన్నేయడంతో పరిస్థితి ముదిరిందని అంటున్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని, అది కూడా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలయ్య చెప్పారు. బాలయ్య పోటీ చేస్తానంటే నూజివీడు సీటు నుంచి తప్పుకుంటానని శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్య అప్పట్లో ప్రకటించారు. అయితే, బాలయ్య మాత్రం గుడివాడ సీటు మీదనే దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.