జెడి కాల్లిస్ట్ వ్యవహారం: రఘురామరాజుకు చుక్కెదురు
కాగా తన కాల్ లిస్ట్ వ్యవహారంలో సిబిఐ జెడి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు తర్వాత సాక్షి యాజమాన్యం తీరు తనను అప్రతిష్ట చేసేలా ఉందని లక్ష్మీ నారాయణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్దేశ్య పూర్వకంగానే తన కాల్ లిస్టును బహిర్గతం చేశారని పేర్కొన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సాక్షి మీడియాలో తన ఫోటోలు, కాల్ లిస్టులు, ఎస్సెమ్మెస్లు పదే పదే చూపిస్తూ, తన గురించి పలు విధాలుగా వ్యాఖ్యానించారని తెలిపారు. జగన్ పార్టీ నేతలు ఉద్దేశ్య పూర్వకంగానే తన కాల్ లిస్టును బహిర్గతం చేశారన్నారు. బ్లాక్ మెయిల్ ద్వారా వ్యవస్థ నైతికతను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేశారన్నారు. జగన్ మీడియా తీరు అనైతికతమన్నారు.
తాము సున్నితమైన, సమస్యాత్మకమైన కేసులను దర్యాఫ్తు చేస్తున్నామని పేర్కొన్నారు. జగన్ అరెస్టు తర్వాత తనను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు తనను టార్గెట్ చేసుకున్నారని తెలిపారు. గతంలో ఎమ్మార్ కేసు విషయంలో వ్యాపారవేత్త రఘురామరాజు తన కాల్ లిస్టుతో ఫిర్యాదు చేసి వెనక్కి తీసుకున్నారన్నారు. ఈ కాల్ లిస్టు వెనుక ఆయన పాత్ర ఉండి ఉంటుందని జెడి ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు.
రఘురామరాజును విచారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న వ్యక్తులు, పార్టీలు, సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాల్ లిస్టు బయట పెట్టి తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరిగిందన్నారు. టెలికాం శాఖ కాల్ లిస్ట్ విషయంలో ప్రోటోకాల్ పాటించలేదని చెప్పారు. టెలికాం శాఖనే తన కాల్ లిస్టును బయటకు ఇచ్చిందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల ప్రకటన, కాల్ లిస్టును జెడి మూడు పేజీల ఫిర్యాదుకు జతపర్చారు. జెడి ఫిర్యాదులో తన పేరును ప్రస్తావించడంతో రఘురామ రాజు కోర్టుకెక్కారు. ఆయన పిటిషన్ను శుక్రవారం కోర్టు కొట్టివేసింది.