హుక్కా సెంటర్ యజమాని ఖలీం అరెస్ట్, కొత్త ట్విస్ట్
హుక్కా సెంటర్ నిర్వాహకులు దీపక్ అనే ఇంటర్ విద్యార్థినిని నిర్బంధించి చితకబాదారు. బాకీ చెల్లించలేదని అతనిని కొట్టారు. దీంతో ఆ విద్యార్థి పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన పోలీసులు హుక్కా సెంటర్ పైన దాడి చేశారు. దానిని మూసివేయించారు. ఈ రోజు యజమాని ఖలీంను అరెస్టుచేశారు. గత రెండు రోజులుగా పోలీసులు హుక్కా సెంటర్లు, పబ్లపై దాడులు నిర్వహిస్తున్నారు.
బంజారాహిల్స్లోని టానిక్ పబ్పై పోలీసులు ఇటీవల దాడి చేసిన విషయం కూడా తెలిసింది. ఈ దాడిలో విఐపిలు బయటపడ్డారు. గత శనివారం ఓ ఫార్మా కంపెనీ యజమాని కూతురు పుట్టిన రోజు కావడంతో టానిక్ క్లబ్లో వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు వచ్చిన వారంతా ప్రముఖులే. వ్యాపారావేత్తలు, ఫ్యాషన్ డిజైనర్లు, సినిమా పరిశ్రమ వారు, విద్యార్థులు, జర్నలిస్టులు, బ్యూటీషియన్స్, విదేశీయులు ఉన్నారు.
వీరంతా ఓ ఫార్మా కంపెనీకి చెందిన యజమాని కూతురు పుట్టిన రోజు వేడుకలకు వచ్చారు. పదిమంది వరకు డాక్టర్లు, పదిమంది వరకు ఫ్యాషన్ డిజైనర్లు, బ్యూటీషియన్స్, సాఫ్టువేర్ ఇంజనీర్లు ఉన్నారని తెలుస్తోంది. విద్యార్థులు కూడా చాలామందే ఉన్నారు. ఇద్దరు జర్నలిస్టులు ఉండటం గమనార్హం. అరబ్ ఎమిరేట్స్కు చెందిన ఓ యువతి కూడా ఉందని తెలుస్తోంది. పోలీసులను దుర్భాషాలాడినందుకు దుబాయ్కు చెందిన ఆ యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తాము పబ్ పైన కేసు నమోదు చేశామని ఎసిపి శంకర్ రెడ్డి తెలిపారు. పబ్ యజమానిని, మేనేజర్ను అదుపులోకి తీసుకొని, పబ్ను సీజ్ చేసినట్లు చెప్పారు. దుబాయ్ యువతిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా సమయం దాటినా నడుపుతున్న విషయం తమ దృష్టికి వచ్చి దాడి చేశామన్నారు. ఎవరైనా విఐపిలు ఉన్నారా అని ప్రశ్నించగా... తాము బడాబాబులు చోటాబాబులు అని చూడమని నేరం చేసిన వాళ్లను అరెస్టు చేస్తామని చెప్పారు.
ఈ నెల 14వ తేదిన తల్లిదండ్రుల సమక్షంలో వారందరికీ కౌన్సెలింగ్ ఇస్తామని పోలీసులు తెలిపారు. ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఫిర్యాదు రావడంతో రైడ్ చేశామని ఎస్ఐ చంద్రశేఖర్ చెప్పారు. కాగా అదుపులోకి తీసుకున్న పలువురిని సొంత పూచికత్తుపై విడుదల చేశారు. పబ్ యజమాని శ్రీకాంత్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో 82 మందిని అదుపులోకి తీసుకొని ఆ తర్వాత విడుదల చేశారు.