రెండో రోజు: లిఖితపూర్వకంగా ఈడికి జగన్ జవాబు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం ఆరు గంటల పాటు విచారించారు. ఉదయం పదిన్నర గంటలకు జగన్ విచారణ ప్రారంభించిన అధికారులు నాలుగున్నర గంటలకు ముగించారు. జగన్ నుండి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్లుగా తెలుస్తోంది. జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్లోకి విదేశాల నుండి పెట్టుబడులు ఎంత వచ్చాయి, ఎలా వచ్చాయి, ఏవైనా అక్రమ పెట్టుబడులు ఉన్నాయా అని జగన్ను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
మలేషియా, సింగపూర్, లగ్జెంబర్గ్ తదితర దేశాల నుండి జగతిలోకి వచ్చిన పెట్టుబడులపై వివరాలు ఆరా తీశారని తెలుస్తోంది. జగన్ను విచారించేటప్పుడు అతని తరఫు న్యాయవాదులు ఉన్నారు. 7 నుంచి 21 తేదీలోగా జగన్ను జైల్లో ఉదయం 10 నుంచి 5 గంటలలోపు ప్రశ్నించడానికి ఈ నెల 6న సిబిఐ కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.
దీంతో 13వ తేదీన విచారణ చేపట్టనున్నట్టు జగన్కు జైలులో ఈడి అధికారులు పణిభూషణ్, వైయ్ ఎన్ రావు 9వ తేదీన నోటీసులు జారీ చేశారు. ఈరోజు జరిగే విచారణలో ఈడి అధికారులు ముందుగా రూపొందించిన ప్రశ్నావళిని జగన్కు అందించారని సమాచారం. విదేశీ కంపెనీల నుంచి జగన్ కంపెనీల్లోకి పెట్టుబడుల ప్రవాహంపై ఈడి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.