'భారతి'లోకి ఫ్రెంచ్ నిధులు: ఈడి ప్రశ్నతో జగన్ కంగు!
సూటి ప్రశ్నతో జగన్ కంగుతిన్నారట! దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని సిమెంట్ కంపెనీలలోకి అక్రమంగా పెట్టుబడులు వచ్చినట్లుగా ఈడి అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మేళ్లు పొందిన వారే అందులో పెట్టుబడులు పెట్టి ఉంటారని భావిస్తోంది. సొమ్మును విదేశాలకు తరలించి అక్కడి నుంచి తన సంస్థల్లోకి పెట్టుబడులుగా తీసుకొచ్చిన వైనంపై ఈడీ ఫెమా, మనీల్యాండరింగ్ చట్టాల కింద కేసులు నమోదు చేసింది.
జగతి పబ్లికేషన్స్లోకి మారిషస్, ఫ్రాన్స్ దేశాల నుంచి పరోక్షంగా వచ్చిన సొమ్ము గురించి ఇప్పటికే సమాచారం రాబట్టిన ఈడి అధికారులు తాజాగా సిమెంటు కంపెనీలో పెట్టుబడులపై ప్రశ్నించినట్లు తెలిసింది. ఉదయం పదకొండు గంటలకు జైలుకు చేరుకున్న అధికారులు వైయన్ రావు, యానాది రెడ్డి, రాజేశ్వర్ సింగ్, కమల్ సింగ్లు జగన్ను ప్రశ్నించారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం ఆరు గంటల పాటు విచారించారు. ఉదయం పదిన్నర గంటలకు జగన్ విచారణ ప్రారంభించిన అధికారులు నాలుగున్నర గంటలకు ముగించారు. జగన్ నుండి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్లుగా తెలుస్తోంది. జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్లోకి విదేశాల నుండి పెట్టుబడులు ఎంత వచ్చాయి, ఎలా వచ్చాయి, ఏవైనా అక్రమ పెట్టుబడులు ఉన్నాయా అని జగన్ను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
మలేషియా, సింగపూర్, లగ్జెంబర్గ్ తదితర దేశాల నుండి జగతిలోకి వచ్చిన పెట్టుబడులపై వివరాలు ఆరా తీశారని తెలుస్తోంది. జగన్ను విచారించేటప్పుడు అతని తరఫు న్యాయవాదులు ఉన్నారు. 7 నుంచి 21 తేదీలోగా జగన్ను జైల్లో ఉదయం 10 నుంచి 5 గంటలలోపు ప్రశ్నించడానికి ఈ నెల 6న సిబిఐ కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.