'బిసి'పై దూకుడు పెంచిన బాబు: జగన్, కిరణ్కు సవాల్
సమర్థవంతమైన వారు వస్తే బిసిలకు వంద సీట్లు మాత్రమే కాదని, అంతకంటే ఎక్కువ సీట్లు కూడా ఇచ్చేందుకు టిడిపి సిద్ధంగా ఉందని చంద్రబాబు ప్రకటించారు. బిసి వాదనతో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసులు భయపడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెసులో బిసిలకు ఏం న్యాయం జరిగిందో చెప్పాలన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
బిసిల కోసం ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తామన్నారు. టిడిపి ప్రవేశ పెట్టిన బిసి డిక్లరేషన్ తర్వాత ఇప్పుడు అన్ని పార్టీల వారు దాని గురించి మాట్లాడుతున్నారన్నారు. తమ బిసి డిక్లరేషన్ పైన ఎద్దేవా చేస్తున్న వారు మా కంటే మంచి బిసి పాలసీ ప్రకటించాలని... కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసును ఉద్దేశించి సవాల్ చేశారు. మా డిక్లరేషన్ పైన మాట్లాడటం కాకుండా మీరేం చేశారో చెప్పండని ప్రశ్నించారు.
వెనుకబడిన వర్గాల సంక్షేమం విషయంలో వెనక్కిపోయే ప్రసక్తే లేదన్నారు. బిసి డిక్లరేషన్ ఎలా సాధ్యమో చేసి చూపిస్తామన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన అన్ని వర్గాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో వివిధ బిసి సంఘాల నేతలు బాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.