ఓటేసుకోండి!: జగన్, మోపిదేవిలకు కోర్టు గ్రీన్ సిగ్నల్
ఓటు వేసేందుకు షరతులు పెట్టింది. వారు ఓటు వేసే సమయంలో బయటవారితో సంప్రదింపులు జరపకుండా చూడాలని కోర్టును సిబిఐ కోరింది. వారికి సిబిఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కోర్టు సాయంత్రంలోగా తన నిర్ణయాన్ని వెలువరించనున్నది. కాగా రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసేందుకు తనకు అనుమతివ్వాలని వైయస్ జగన్, మోపిదేవి వెంకటరమణలు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జూలై 19న రాష్ట్రపతి ఎన్నికలు ఉండటంతో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు మోపిదేవి వెంకటరమణ కోర్టును ఆశ్రయించారు.
అంతకుముందు రోజు సోమవారం వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే విషయమై కోర్టును ఆశ్రయించారు. తనకు హైదరాబాదులో ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన తన పిటిషన్లో కోరారు. తనకు ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ నుండి అనుమతి వచ్చిందని చెప్పారు. ఓటింగ్ వద్దకు తనను జైలు అధికారులు తీసుకు వెళ్లే విధంగా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఓటు అనేది తనకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఎన్నికలలో పాల్గొనే విధంగా చూడాలని కోరారు. జగన్ పిటిషన్ స్వీకరించిన కోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
అంతకుముందు తనను ఓటింగుకు అనుమతించాలని జగన్ గతంలో కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ఓటు విషయం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని సూచించారు. దీంతో జగన్ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఓటు వేసేందుకు ఈసి అనుమతించింది. దీంతో జగన్ తాజాగా ఓటు వేసేందుకు తనకు ఈసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఓటింగ్ వద్దకు తనను తీసుకు వెళ్లేందుకు అనుమతివ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
వీరి పిటిషన్లను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఓటింగులో పాల్గొనడంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని సిబిఐని ఆదేశించింది. తమకు అభ్యంతరం లేదని సిబిఐ తెలిపింది. సాయంత్రం కోర్టు నిర్ణయం వెలువరించనుంది. కోర్టు కూడా ఓకే చెబితే జగన్ను, మోపిదేవిని ప్రత్యేక వాహనంలో అసెంబ్లీకి తీసుకు వెళ్లి ఓటు వేయించనున్నారు.