పడవపై అమెరికా కాల్పులు, తమిళనాడువాసి మృతి
చేపల వేటకు వెళ్లిన బోటు సిబ్బంది తాము పదేపదే హెచ్చరిస్తున్నా వినకుండా తమ నౌకవైపు దూసుకు రావడంతో మెషిన్గన్తో కాల్పులు జరిపినట్లు అమెరికా నౌకాదళ ప్రతినిధి రేల్సన్ ప్రకటించారు. అయితే ఈ పడవను ఇరాన్కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ పడవగా భావించి కాల్పులు జరిపినట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఈ పడవ ఇరాన్ నౌకాదళం ఉపయోగించే పడవనే పోలి ఉండడం వల్ల ఈ పొరపాటు జరిగిందని అంటున్నారు.
గల్ఫ్ జలాలలో గతంలో కూడా అమెరికా నౌకాదళం, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అనేకసార్లు తలపడ్డాయి. ఈ సంఘటనపై విచారణ జరుపుతామని యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. మరణించిన జాలరిని తమళనాడులోని రామనాథపురం జిల్లా పెరియపట్టణం నివాసి శేఖర్గా గుర్తించినట్లు కరైయూర్ జాలర్ల సంఘం అధ్యక్షుడు మలైరాజన్ చెప్పారు.
గాయపడిన మునిరాజ్, పన్పువన్, మురగన్ కూడా రామనాథపురం జిల్లాకు చెందినవారేనని ఆయన చెప్పారు. బుల్లెట్ గాయాలతో మునిరాజ్ ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. రామనాథపురం జిల్లాకు చెందిన జాలర్లలు దుబాయ్ ఫిషింగ్ కంపెనీల్లో దినసరి వేతనంపై పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.