ఘనత చిరుది, బాబుది మోసం: మంత్రి రామచంద్రయ్య

దమ్ముంటే మిగతా పార్టీలు కూడా 100 సీట్లు ఇస్తామని ప్రకటన చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు సవాళ్లు విసురుతుంటే నవ్వు వస్తోందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయల పట్ల బాధ కలుగుతోందని, ఆ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం, వలసల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మల్లీ బిసి డిక్లరేషన్ అనే డ్రామాకు తెర లేపారని ఆయన వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లు ఇస్తామని చెప్పి దేశంలోనే సంచలనం సృష్టించామని గొప్పలు చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. 2009లో 100 సీట్లు ఇస్తామని చెప్పి మోసం చేసిన చంద్రబాబు మళ్లీ ఎన్నికల ముందు అదే హామీ ఇస్తే నమ్మేదెవరని ఆయన అడిగారు. విశ్వసనీయత కోల్పోయిన చంద్రబాబు కేవలం ప్రకటనలు చేసినం మాత్రాన దేశంలో సంచలనం కలుగుతుందా అని ఆయన అడిగారు. అటువంటి సంచలనం, చరిత్రను సృష్టించిన ఘనత చిరంజీవిదేనని ఆయన అన్నారు.
ఆ రోజు చిరంజీవి చేసిన చారిత్రక సామాజిక న్యాయం ప్రజల్లోకి వెళ్లకుండా కొంత మంది దుష్ప్రచారం చేశారని, ఆరు జనరల్ స్థానాల్లో కూడా ఎస్సీలకు, ఎస్టీలకు అసెంబ్లీ సీట్లను ఆ రోజు కేటాయించామని ఆయన అన్నారు. చరిత్రలో అదొక అధ్యాయమని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు బీసిలనే కాదు, మహిళలను, మైనారిటీలను, యువతను కూడా మభ్య పెట్టారని ఆయన విమర్శించారు. 2009 ఎన్నికలకు ముందు నెల్లూరు మహిళా సదస్సు నిర్వహించి పార్లమెంటులో 33 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినా పొందకపోయినా తెలుగుదేశం పార్టీ మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తుందని చంద్రబాబు చెప్పారని, అదే విధంగా కర్నూలు మైనారిటీ సదస్సులో జిల్లాకు కనీసం ఇద్దరు మైనారిటీలకు సీట్లు ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీలను చంద్రబాబు అమలు చేయలేదని ఆయన అన్నారు.
యువతకు 40 శాతం సీట్లు ఇస్తామని ఇచ్చిన హామీని కూడా అమలు చేయలేదని ఆయన విమర్శించారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి సీట్లు కేటాయింపు దగ్దరకు వచ్చేసరికి గెలుపు గుర్రాలతో పేరుతో ధనవంతులకు సీట్లు కేటాయించిన నైజం చంద్రబాబుదని ఆయన విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తటస్థ వైఖరి అవలంబించడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications