యుపిఎ సంక్షోభం: రాజీనామాకు పవార్, ప్రఫుల్ రెడీ?
మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో నెంబర్ టూ వివాదమే ఈ పరిస్థితికి దారి తీసినట్లు తెలుస్తోంది. మన్మోహన్ సింగ్ పక్క సీటులో ఇంతకు ముందు ప్రణబ్ ముఖర్జీ కూర్చునే వారు. ప్రణబ్ ముఖర్జీ మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత జరిగిన తొలి సమావేశంలో శరద్ పవార్ సీటును ప్రధాని పక్కన వేశారు. రెండో సమావేశంలో కూడా అదే విధమైన ఏర్పాటు జరిగింది. అయితే, ఆ తర్వాత ఆ సీటును కేంద్ర మంత్రి ఆంటోనీకి కేటాయించి, మూడో సీటును పవార్కు కేటాయించారు. ప్రణబ్ ముఖర్జీ రాజీనామా చేసిన తర్వాత నాలుగు మంత్రి వర్గ సమావేశాలు జరిగాయి. నెంబరూ టూ విషయంలో శరద్ పవార్ అలిగినట్లు చెబుతున్నారు.
తాము సమావేశానికి హాజరు కాలేదని ఎన్సీపి అధికార ప్రతినిధి డిపి త్రిపాఠీ చెప్పారు. అయితే, అందుకు గల కారణం చెప్పడానికి నిరాకరిస్తూ నో కామెంట్ అన్నారు. ప్రధాని నివాసంలో సమావేశం జరుగుతుండగా పవార్ ప్రఫుల్ పటేల్, త్రిపాఠీలతో చర్చలు జరిపారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై గత శనివారం జరిగిన యుపిఎ సమావేశానికి కూడా ఎన్సీపి హాజరు కాలేదు.
తాను ప్రధానికి రాజీనామా లేఖ పంపినట్లు జరిగిన ప్రచారాన్ని ప్రఫుల్ పటేల్ ఖండించారు. మర్యాద కోసమే రాష్ట్రపతి ఎన్నికలు ముగిసే వరకు ఎన్సీపి మౌనంగా ఉండిపోయిందని అంటున్నారు. యుపిఎ భాగస్వామ్య పక్షమైన ఎన్సీపికి 9 మంది లోకసభ సభ్యులున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఎన్సీపి భాగస్వామి. భద్రతకు సంబంధించిన ఉన్నత స్థాయి మంత్రివర్గ సంఘంలో తనను చేర్చకపోవడంపై కూడా శరద్ పవార్ అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.