ఏదో చేయాలి, ఏం చేయాలో..: తెలంగాణపై వాయలార్

రాష్ట్రపతి ఎన్నికలు ముగుస్తున్నందున తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయం తీసుకోబోతోందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తెలంగాణపై తామింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇందుకు మరికొంత సమయం పడుతుందని చెప్పారు. ఏది ఏమైనా.. ఇకనుంచి తాము ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టి సారించక తప్పదని చెప్పారు. ఏదో ఒక పరిష్కారం చేయాల్సి ఉన్నప్పటికీ, ఏం చేయాలనేది తామింకా నిర్ణయించలేదని చెప్పారు. ఒక ప్రణాళికను రూపొందించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, కాబట్టి మరికొంత కాలం వేచి చూడాలని ఆయన సూచించారు.
కాగా, ఇటీవలి కాలంలో తెలంగాణకు సంబంధించి పార్టీ స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అధినేత్రిపై ఒత్తిడి పెరుగుతోంది. రాష్ట్రానికి చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సోనియా, రాహుల్లను కలుసుకుని, ఇక ఎంత మాత్రం జాప్యం చేయరాదని కోరుతున్నారు. దీంతో, ఈనెల 25న రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, తెలంగాణపై పార్టీ సీనియర్ నేతలతో సోనియా చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
తెలంగాణతోపాటు చిన్న రాష్ట్రాలపై తన వైఖరిని కాంగ్రెస్ పార్టీ సాధ్యమైనంత త్వరలో ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ఆగస్టు 8 నుంచి జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం తెలంగాణపై అధికారిక ప్రకటన చేయవచ్చునని తెలుస్తోంది. దశలవారీగా కాకుండా రాష్ట్రంలో సమగ్ర మార్పులకు దోహదం చేసేలా తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని సోనియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోపు తెలంగాణ, రాష్ట్రంలో రాజకీయ మార్పులకు సంబంధించి ఒక ఫార్ములాను రూపొందించవచ్చునని సమాచారం.












Click it and Unblock the Notifications