జగన్ బెయిల్ పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నారు?
బెయిల్ కోసం సుప్రీంకోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్లో కింది కోర్టుల్లో చేసిన కారణాలనే చూపినట్లు తెలుస్తోంది. తనపై సిబిఐ సాక్ష్యాలను సేకరించలేకపోయిందని, తనను అక్రమంగా అరెస్టు చేసిందని అంటూ ఆయన బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, తాను చూపిన కారణాలతో కింది కోర్టులు బెయిల్ ఇవ్వడానికి అంగీకరించలేదు. కింది కోర్టుల మాదిరిగానే సుప్రీంకోర్టు కూడా బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తే మరో ఆరు నెలల పాటు బెయిల్ పొందడానికి వీలుండదు. ఏ కోర్టులోనూ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి వీలు కాదు. ఆరు నెలల పాటు జైలులోనే ఉండాల్సి వస్తుంది.
ఈడి విచారణ ముగియడంతో కొత్త కారణాలు చూపుతూ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే మంచిదనే అభిప్రాయంతో సుప్రంకోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్ను ఆయన ఉపసంహరించుకున్నట్లు చెబుతున్నారు. న్యాయనిపుణుల సలహా మేరకు ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ను వెనక్కి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మళ్లీ మొదటి నుంచి ప్రారంభమైతే న్యాయపరమైన అంశాలు తనకు అనుకూలంగా ఉండవచ్చునని ఆయన తన న్యాయవాదుల సలహాల కారణంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పైగా, ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్రపతి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటేసి జగన్కు బెయిల్ సంపాదించుకుంటోందనే విమర్శల నుంచి కూడా తప్పించుకోవచ్చునని ఆయన భావించినట్లు చెబుతున్నారు. అయితే, వైయస్ జగన్, ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తీవ్రంగా తప్పు పడుతోంది. కాంగ్రెసు పార్టీతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుమ్మక్కయిందని, అందుకే ప్రణబ్ ముఖర్జీకి వైయస్సార్ కాంగ్రెసు ఓటేసిందని తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు విమర్శించారు. దానివల్లనే వైయస్ జగన్ కేసు దర్యాప్తులో తాత్సారం జరుగుతోందని, జగన్ బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నారని, సిబిఐ జెడి లక్ష్మినారాయణ అదృశ్యమయ్యారని ఆయన సోమవారం వ్యాఖ్యానించారు.