మళ్లీ పెట్రో మోత, హైదరాబాద్ ధర రూ.75.89 పైసలు
డాలర్పై రూపాయి విలువ తగ్గడం కూడా పెట్రోల్ ధర పెంపునకు మరో కారణమని చెబుతున్నారు. పెట్రోల్ ధర పెంపునకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఎన్నికల కోసం వేచి చూసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది మే 23వ తేదీన చమురు కంపెనీలు పెట్రోల్ ధరను లీటరుకు రు.7.50 పైసలు పెంచాయి. ఒకేసారి ఇంత పెద్ద మొత్తం పెరగడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు తలెత్తాయి, ప్రతిపక్షాలు విమర్శలు కురిపించాయి.
నిరసనలతో ధరను యుపిఎ ప్రభుత్వం కాస్తా తగ్గించింది. తొలుత జూన్ 3వ తేదీన లీటరుకు రు. 2.02 పైసలు తగ్గించింది. ఆ తర్వాత జూన్ 29వ తేదీన లీటరుకు రూ.2.46 పైసలు తగ్గించారు. ప్రస్తుత ధర వల్ల పెట్రోల్ ధర లీటరుకు ఢిల్లీలో 68.48 పైసలు, ముంబైలో రూ.74.23 పైసలు, చెన్నైలో రూ.73.16 పైసలు, కోల్కత్తాలో రూ.73.61 పైసలు, హైదరాబాద్లో రూ.75.89 పైసలు, బెంగళూర్లో రూ.77.30 పైసలు పలుకుతుంది.
ముడి చమురు బ్యారెల్ ధర 101.28 డాలర్ల నుంచి 111.59 డాలర్లకు పెరిగింది. అలాగే రూపాయి విలువ డాలర్పై రూ.55.36 రూపాయలకు పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్లో లీటర్ పెట్రోల్పై ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు రూ.1.41 పైసలు నష్టం వాటిల్లే పరిస్థితి వచ్చింది. అయితే, ధరలు హెచ్చుతగ్గులు తరుచుగా జరుగుతుండడంతో చమురు కంపెనీలు లీటర్ ధరను 70 పైసలు పెంచాలని నిర్ణయించాయి.