మేటి చిత్రకారుడు కొండపల్లి శేషగిరి రావు కన్నుమూత
ఆయనకు ఆరుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. భార్య కమలాదేవి ఇటీవలే మరణించారు. పెద్ద కుమారుడు ఓంప్రకాష్ కూడా కొన్నాళ్ల క్రితం మరణించారు. శేషగిరిరావు మృతి వార్తతో తెలుగు చిత్రకళా రంగం విషాదంలో మునిగిపోయింది. ఆయనకు సీఎం కిరణ్కుమార్రెడ్డి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తదితర ప్రముఖులు నివాళి అర్పించారు.
రామచూడమ్మ, గోపాలరావు దంపతులకు 1924 జనవరి 27న వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం పెనుకొండలో శేషగిరిరావు జన్మించారు. బాల్యంనుంచే చిత్రకళపై మక్కువ పెంచుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ, రాజస్థాన్ బనస్థలి విద్యాపీఠ్, హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాప్ట్స్లో విద్యనభ్యసించారు. శాంతినికేతన్లో నందలాల్బోస్ శిష్యరికంలో చిత్రకళను ఔపోసన పట్టారు. దీన్దయాళ్నాయుడు, జలాలుద్దీన్ సాహెబ్ల వద్ద కళా రహస్యాలు గ్రహించారు.
1950లో సంతాల్ హార్మని, కాకులు లాంటి చిత్రాలకు బహుమతులు అందుకున్నారు. ప్రకృతి, పక్షులు, జంతువులు చారిత్రక అంశాలు, ఆక్వాటెక్చర్ తదితర అంశాలు, వాటర్కలర్, ఆయిల్ పెయింటింగ్లో ఆయన సిద్ధహస్తులు. జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఫైనార్ట్స్, ఆర్కిటెక్చర్లో ప్రొఫెసర్గా పనిచేశారు. ఎమిరిటస్ ప్రొఫెసర్గా, ఉస్మానియా యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ సభ్యుడిగా, ఏపీ లలితకళా అకాడమీ కోశాధికారిగా కొనసాగారు.
మాతృభాషపై మమకారంతో సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలోని గోలుకొండ పత్రికలో చిత్రాలు, కార్టూన్లు వేసేవారు. ఆయన చిత్రాలలో వరూధిని ప్రవరాఖ్య, నిజాం పాలన, శకుంతల, దమయంతి, సరస్వతి లాంటి చిత్రాలు అత్యంత గణనీయమైనవి. సీఓడీ, మైత్రివనం, బషీర్బాగ్లోని భారతీయ విద్యాభవన్లో శేషగిరిరావు చిత్రాలు ఇప్పటికీ కనిపిస్తాయి. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా శకటాల రూపకల్పనతోపాటు ప్రదర్శనకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించే వారు.
కాగా, ఎమ్మెల్సీ చుక్కారామయ్య, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ శివారెడ్డి, వైకుంఠం, మోహన్, వరవరరావు, బి.నర్సింగ్రావు తదితరులు నివాళి అర్పించారు.