ఇంటికెళ్దామని...: 8 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన యువతి
వెంకట లక్ష్మి ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాదు ఎస్ఆర్ నగర్లోని తన బాబాయి ఇంటి నుండి 2004లో అదృశ్యమైంది. అప్పుడు ఆమె వయస్సు 11 సంవత్సరాలు. ఆమె మిస్ అయినట్లు ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. వెంకట లక్ష్మి ఎస్ఆర్ నగర్లోని తన బాబాయి ఇంట్లో ఉండి చదువుకునేది. ఓ రోజు హోం వర్క్ సరిగా చేయలేదు. దీంతో టీచర్స్ ఏమైనా ఆంటారేమోనని భయపడి వరంగల్లోని తన ఇంటికి వెళ్లిపోదామనుకుంది.
ఓ రైలు ఎక్కింది. తీరా ఆ రైలు తాను దిగాల్సిన చోటుకు కాకుండా గుజరాత్ రాష్ట్రంలోని సూరత్కు చేరుకుంది. అక్కడ ఆమెను పోలీసులు మహిళా సంక్షేమ గృహానికి తరలించారు. చిన్న వయసు కావడంతో భాష తెలియక పోవడంతో తన ఆచూకీ చెప్పలేక పోయింది. దీంతో అక్కడి పోలీసులు ఆమెను సంక్షేమ గృహంలోనే ఉంచారు. ఆమె ఆచూకీ తెలియని కుటుంబ సభ్యులు ఆమె కోసం ఎంత వెతికినా కనిపించలేదు.
ఆ తర్వాత సూరత్ పోలీసులు ఆమె ఆంధ్ర ప్రదేశ్కు చెందిన యువతి అని గుర్తించారు. ఎపి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అఖ్కడకు వెళ్లి విచారించి ఆమె ఆచూకి కనుగొన్నారు. తర్వాత తల్లి, బంధువులతో సూరత్ వెళ్లి వెంకట లక్ష్మిని తీసుకు వచ్చారు.
తాను హైదరాబాదులో చదువుతుండగా ఓ రోజు ఉపాధ్యాయులు ఇచ్చిన ఇంటి పని చేయలేదని, భయపడి తాను ఇంటికి వెళతామని రైలు ఎక్కానని, కానీ సూరత్లో దిగానని వెంకట లక్ష్మి చెబుతోంది. తాను ఇన్నాళ్లు గుజరాత్లో ఉన్నందున ఇక్కడి భాషను సరిగా అర్థం చేసుకోలేక పోతున్నానని చెప్పింది.