బాబు ఇంట్లో టిడిపి పార్లమెంటరీ భేటీ: హరికృష్ణ హాజరు

రాజీకొచ్చిన హరికృష్ణ
కాగా ఇటీవలి వరకు చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్న హరికృష్ణ రాజీకొచ్చినట్లుగా కనిపిస్తోంది. హరికృష్ణను చంద్రబాబు బుజ్జగించినట్లు సమాచారం. వారసత్వ పోరు వల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఇప్పుడు పార్టీని గెలుపు బాటలో నడిపించాల్సి ఉందని చంద్రబాబు హరికృష్ణకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని కొందరు పార్టీ సీనియర్ నేతలు కూడా హరికృష్ణతో చెప్పినట్లు తెలుస్తోంది.
ఏవైనా సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చునని వారు హరికృష్ణకు చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. సోదరుడు బాలకృష్ణతో సమస్యలు ఏవైనా ఉంటే మాట్లాడుకోవచ్చునని, అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని వారు హరికృష్ణకు చెప్పినట్లు తెలుస్తోంది. అంతకు ముందు పార్టీ కార్యాలయం నుంచి తన పేరు మీద ప్రకటనలు వెలువరించకూడదని హరికృష్ణ అంతకు ముందు ఆదేశించారు.
దాంతో చాలా కాలంగా హరికృష్ణ పేరు మీద పార్టీ కార్యాలయం నుంచి ఏ విధమైన ప్రకటనలు రావడం లేదు. అయితే తాజాగా, నెల్లూరు తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు దుర్ఘటనపై ఆయన పేరు మీద మీడియాకు ఓ ప్రకటన వెలువడింది. దీన్ని బట్టి చంద్రబాబుకు, హరికృష్ణకు మధ్య రాజీ కుదిరినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పార్టీలో చురుకైన పాత్ర నిర్వహించాలని చంద్రబాబు హరికృష్ణకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.
చాలా కాలంగా, హరికృష్ణ చంద్రబాబు పనితీరు పట్ల తీవ్ర ఆసంతృప్తితో ఉన్నారు. దాంతో హరికృష్ణ తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్తో కలిసి అసమ్మతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ప్రచారం జరిగింది. విజయవాడ నాయకుడు వల్లభనేని వంశీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను ఆలింగనం చేసుకోవడం వెనక, గుడివాడ శానససభ్యుడు కొడాలి నాని వెనక ఆయన ఉన్నట్లు అనుమానించారు. అయితే, ఆ అనుమానాలను జూనియర్ ఎన్టీఆర్తో పాటు హరికృష్ణ కూడా నివృత్తి చేసే ప్రయత్నాలు చేశారు. తమ పాత్ర ఆ వ్యవహారాల్లో లేదని వారు స్పష్టం చేశారు. అయినా, విభేదాలు సమసిపోలేదని అంటూ వచ్చారు.












Click it and Unblock the Notifications