అన్నా టీమ్ రద్దు: రాజకీయ పార్టీ ఏర్పాటుకు మార్గం
అన్నా హజారే బ్లాగ్లో ఆ మేరకు ఓ ప్రకటన వెలువడింది. అయితే, తక్షణమే రాజకీయ ఏర్పాటుపై ప్రకటన చేస్తారా, లేదా అనే విషయాన్ని అందులో ప్రస్తావించలేదు. రాజకీయ ప్రత్యామ్నాయ విధానంపై మాత్రం అన్నా హజారే మాట్లాడారు. ప్రభుత్వం జన లోక్పాల్ బిల్లు తేవడానికి సిద్ధంగా లేదని విమర్శిస్తూ ఎన్ని సార్లు, ఎంత కాలం దీక్ష చేయాలని ఆయన ప్రశ్నించారు.
దీక్ష విరమించి, రాజకీయ ప్రత్యామ్నాయం కోసం చూడాలని ప్రజలు తము కోరారని, ప్రభుత్వం అవీనితిని అంతం చేయడానికి సిద్ధంగా లేదని తనకు అర్థమైందని, ఈ రోజు నుంచి తాము అన్నా టీమ్ కార్యక్రమాలను విరమించుకుంటున్నామని, ప్రభుత్వంతో చర్చలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నామని, టీమ్ అన్నా గానీ టీమ్ అన్నా కోర్ కమిటీ గానీ ఓ రోజు నుంచి ఉండదని ఆయన వివరించారు.
రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనే అన్నా ఆలోచనను ఇంతకు ముందు సంతోష్ హెగ్డే, మేధా పాట్కర్, చంద్రమోహన్, అఖిల్ గోగోయ్ లాంటివాళ్లు వ్యతిరేకించారు. పార్లమెంటుకు మంచి వ్యక్తులను పంపించడానికి తాను ప్రత్యామ్నాయాన్ని ఇస్తున్నానని, తాను ఏ పార్టీలో కూడా ఉండబోనని, తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయన చెప్పారు. జన్ లోక్పాల్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత తాను మహారాష్ట్రకు వచ్చిన తన కార్యక్రమాల్లో నిమగ్నమవుతానని ఆయన చెప్పారు.
పార్టీని ఏర్పాటు చేస్తున్నవారికి తాను ఆ విషయం చెప్పానని, పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఉద్యమం సాగుతుందని, పార్లమెంటుకు మంచి వ్యక్తులను పంపించి జన్ లోక్పాల్ బిల్లును ఆమోదింపజేసుకోవడం తమ లక్ష్యమని ఆయన చెప్పారు.