తెలుగుతల్లి దెయ్యమే, నన్నయ ఆదికవి కాడు: కెసిఆర్
సీమాంధ్రుల తల్లి ఆంధ్ర మాత అయితే తెలంగాణ వారి తల్లి తెలంగాణ తల్లేనని ఆయన చెప్పారు. హైదరాబాద్లో 40 లక్షల మంది కోస్తా ఆంధ్ర వారు ఉన్నారని శ్రీ కృష్ణ కమిటీ తమ నివేదికలో అబద్ధాలు రాసిందని ఆయన విమర్శించారు. నన్నయ కవిత్వం రాయలేదని, సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడని, అందువల్ల నన్నయ అనువాద కవి మాత్రమేనని ఆయన అన్నారు.
బసవపురాణం రాసిన పాల్కురికి సోమనాథుడే తెలుగులో ఆదికవి అని, ఈ విషయంలో కూడా ఆంధ్రోళ్లు అబద్ధమే చెప్తారని ఆయన అన్నారు. హైదరాబాదును పక్కన పెట్టినా ప్రభుత్వానికి తెలంగాణలోని 9 జిల్లాల నుంచి వచ్చే ఆదాయం ఎక్కువని ఆయన అన్నారు ఆంధ్రలో పన్నుల ఎగవేత ఎక్కువ అని ఆయన అన్నారు ఆంధ్రోళ్లు చట్టాలను ఉల్లంఘిస్తారని, తెలంగాణవాళ్లు నిజాయితీగా పన్నుకు చెల్లిస్తారని ఆయన అన్నారు. 75- 80 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లాకు చెందిన రావెళ్ల సత్యనారాయణ రాసిన గేయంలో తెలంగాణ తల్లి ప్రస్తావన ఉందని, తెలంగాణ తల్లిని, ఆంధ్రమాతను గాయబ్ చేసి మధ్యలో తెలంగాణ తల్లిని పుట్టించారని ఆయన అన్నారు.
వ్యూహాత్మకంగానే తాను ఈ మధ్య ఎక్కువ తక్కువ మాట్లాడడం లేదని ఆయన అన్నారు. ఢిల్లీ వాళ్లతో మాట్లాడుతున్నామని, తెలంగాణ ఇస్తామని వాళ్లు చెబుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై తమకు సిగ్నల్స్ లేవన్నవారికి, సిగ్నల్ సమస్యలున్నాయన్నవారికే దమాక్ సరిగా లేదని ఆయన అన్నారు.
ఈ సభలో జె.ఎ.సి. చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ జయశంకర్ జయంతిని ఉపాథ్యాయుల దినోత్సవంగా జరపాలని, అలాగే జయశంకర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని డిమాండు చేశారు.
కాగా, సభలో వేదికపై ఉన్న పార్లమెంటు సభ్యురాలు విజయశాంతికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ సహా పలువురుకి మాట్లాడే అవకాశం ఇచ్చిన కెసిఆర్ వేదికపై ఉన్న ఒకే ఒక మహిళ విజయశాంతికి మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు.