వెనక్కి తగ్గం: ఫీజు రీయంబర్స్మెంట్పై రఘువీరా
ఆయన గురువారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. తర్వాత రఘువీరా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఫీజులపై ఆంక్షలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు ఆయన ా విధంగా స్పందించారు. ఆంక్షలు విధిస్తున్నారని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. "బడుగు వర్గాల విద్యార్ధులకు ఫీజులు చెల్లించే విషయంలో మాకు రెండో ఆలోచనేలేదు. కాకపోతే...ఉపసపంఘం ముందుకు అధికారులు కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ఆర్ధిక భారం నుంచి గటెక్కేందుకు ఫీజుల్లో కోతపెట్టాలని ప్రతిపాదనలొచ్చాయి" అని ఆయన అన్నారు.
ప్రభుత్వంపై భారం పడకుండా ఏం చేయాలన్నదానిపై బాధ్యత గల అధికారులు కొన్ని ప్రతిపాదనలు ఇచ్చినప్పుడు ఉపసంఘం వాటిని పరిశీలించిందని, అయితే వాటిపై ఉపసంఘంగానీ, ఇటు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచడానికి, పేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఏం చేస్తే బాగుంటుందో ఉపసంఘం పరిశీలిస్తోందని ఆయన అన్నారు. గత కొన్నేళ్లుగా బడుగు, బలహీనవ్గాల విద్యార్ధులకు ఫీజులు చెల్లిస్తూ అనూహ్యంగా ఇప్పుడు వారి భవిష్యత్తుకు కీడుచేయాలని ప్రభుత్వం అనుకుంటుందా? అని ఆయన అడిగారు.
అలాంటిదేమీలేదని ఆయన అన్నారు. విద్యార్ధిపై ఖర్చుపెట్టే ప్రతీ పైసా సద్వినియోగం కావాలన్నదే ప్రభుత్వ తపన అని ఆయన అన్నారు. ఫీజుల అంశం వచ్చే రెండు రోజుల్లో పూర్తిగా కొలిక్కివస్తుందని, ఇప్పటికయితే ఆంక్షలు విధించాలని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
ఇదిలావుంటే, ఫీజు రీయంబర్స్మెంట్పై స్పష్టత ఇస్తామని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా ఇందిరమ్మ బాటలో పాల్గొన్న ఆయన గురువారం ఓ మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విధంగా అన్నారు. ఫీజు రీయంబర్స్మెంట్ అంశాన్ని రాజకీయం చేయవద్దని ఆయన ప్రతిపక్షాలను కోరారు.