టిడిపి నేతలకు జగన్ పార్టీ గాలం: కాంగ్ నేతల మొగ్గు?
ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో కర్నూలు జిల్లాలో జగన్ ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరులలో జగన్ పార్టీ భారీ మెజార్టీ సాధించింది. ఇప్పటికే జిల్లాలో సత్తా చాటుకున్న జగన్ పార్టీ తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను జిల్లాలో పూర్తిగా తుడిచి పెట్టుకు పోయేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు. అందులో భాగంగానే కెఈ బ్రదర్స్కు గాలం వేస్తున్నారని అంటున్నారు.
మరోవైపు జిల్లాలోని కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు జగన్ పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. వారిపై ఉప ఎన్నికల ప్రభావం బాగానే పడిందని అంటున్నారు. కాటసాని రామిరెడ్డి గతంలో జగన్ పార్టీ వైపు తొంగి చూసి మళ్లీ వెనక్కి వచ్చారు. అయితే రాష్ట్రంలో ఇప్పుడు జగన్ హవా నడుస్తుందని భావిస్తున్న పలువురు కాంగ్రెసు ప్రజాప్రతినిధులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారట.