తెలంగాణపైనా బాబు క్లారిటీకి రెడీ, మొదటివారంలోనే
తెలంగాణ అంశాన్ని చంద్రబాబే స్వయంగా ప్రస్తావించినట్లు చెబుతున్నారు. తెలంగాణపై కూడా చర్చిద్దామని, వచ్చే నెల మొదటివారంలో దానిపై స్పష్టత ఇద్దామని ఆయన పార్టీ నాయకులతో చెప్పారని సమాచారం. తెలంగాణపై ఇంతకు ముందు ప్రణబ్ ముఖర్జీకి సమర్పించిన లేఖను ఏం చేశారని కాంగ్రెసును నిలదీద్దామనే ఆలోచనను కూడా చంద్రబాబు బయటపెట్టినట్లు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణపై స్పష్టత ఇద్దామని ఆయన అన్నట్లు చెబుతున్నారు. అయితే, అందరితో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని రాయలసీమకు చెందిన పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్ అన్నట్లు చెబుతున్నారు.
తెలంగాణకు తెలుగుదేశం పార్టీ నిర్ణయం అనుకూలంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అవసరమైతే తెలంగాణపై తాము మరోసారి లేఖ ఇస్తామని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు శనివారం అన్నారు. దీన్నిబట్టి చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా స్పష్టతం ఇచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే సీమాంధ్ర నాయకుల నుంచి పెద్దగా వ్యతిరేకత ఉండకపోవచ్చునని అంటున్నారు. సీమాంధ్రలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా లేకపోవడంతో సీమాంధ్ర నాయకులు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదనే భావనకు వచ్చినట్లు చెబుతున్నారు. వివాదాస్పదమైన అన్ని అంశాలపై పూర్తి స్పష్టత ఇచ్చి ప్రజల విశ్వసనీయతను పొందాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ విషయంలో తమను ద్రోహిగా చూపి కాంగ్రెసు రాజకీయ ప్రయోజనాలు పొందుతోందని, తెలంగాణ రాష్ట్ర సమితి కూడా కాంగ్రెసుకు ప్రయోజనం కలిగే విధంగా తమ పార్టీనే లక్ష్యం చేసుకుందని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై తాము స్పష్టంగా చెప్పడం లేదనే సాకుతో కాంగ్రెసు పార్టీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. తాము స్పష్టత ఇస్తే కాంగ్రెసు ఇరకాటంలో పడుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు కూడా తన వైఖరిని ప్రకటించాల్సి వస్తుందని అనుకుంటున్నారు. తమపై నిందను తొలగించుకుని కాంగ్రెసు, తెరాస, వైయస్సార్ కాంగ్రెసు మిలాఖత్ను ఎండగట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు.