రాజీనామా యోచనలో ధర్మాన: మరో వికెట్ డౌన్
రేపు మంగళవారం ఆయన కేంద్ర మంత్రి పల్లంరాజును ధర్మాన ప్రసాద రావు కలుస్తారు. ఆ తర్వాత సాయంత్రం ఆయన హైదరాబాద్ తిరిగి వస్తారని అంటున్నారు. హైదరాబాదు రాగానే ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, గవర్నర్ నర్సింహన్కు సమర్పిస్తారని చెబుతున్నారు. ఢిల్లీ నుంచి ఫోన్లో ధర్మాన ప్రసాద రావు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడారు. చార్జిషీట్ చూసిన తర్వాత ఏం చేద్దామో నిర్ణయించుకుందామని కిరణ్ కుమార్ రెడ్డి ధర్మాన ప్రసాద రావుతో అన్నట్లు తెలుస్తోంది.
ప్రజస్వామిక విలువలకు కట్టుబడి రాజీనామా చేయడమే మంచిదని ధర్మాన ప్రసాద రావు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. రేపు మంగళవారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఆయన హైదరాబాద్ వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వాన్పిక్ వ్యవహారంలో తనపై అభియోగాలు మోపడంతో ధర్మాన ప్రసాద రావు ఒక్కసారిగా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు.
ధర్మాన ప్రసాదరావుపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలను సంధిస్తున్నాయి. నైతిక విలువలకు కట్టుబడి ఉండే తాను రాజీనామా చేయవలసిందిగా ఎవరితోనూ చెప్పించుకోనని మంత్రి ప్రకటించారు. తనను అరెస్టు చేస్తారని భావించడం లేదని ధర్మాన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఛార్జి షీటు గురించి మీడియా అడగగా, ముందు అందులో ఏముందో చూడాలని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటాననీ ఆయన సమాధానం చెప్పారు. అయితే, ధర్మాన ప్రసాదరావును సిబిఐ అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.