జాతీయ రాజకీయాల్లో జగన్, ఇరుక్కున్నారు: మేకపాటి
ఇంకెంతమంది మంత్రులకు ఉచ్చు బిగుస్తుందో అర్థం కావడం లేదని, ఇప్పటికైనా 26 జివోలపై స్పష్టత ఇవ్వాలని మేకపాటి డిమాండ్ చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో స్నేహం చేసేందుకు ఢిల్లీలో అందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికలు వస్తే తమ పార్టీ తరఫున 40 మంది ఎంపీలు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిర్ణయాత్మక శక్తిగా వైయస్సార్ కాంగ్రెసు మారబోతుందని, రాబోయే రోజుల్లో వైయస్ జగన్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు.
26 జివోల విషయమై ఇప్పటికే ఓ బిసి నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ రాజీనామా చేశారని, తాజాగా మంత్రి ధర్మాన ప్రసాద రావు రాజీనామాను సమర్పించారని గుర్తు చేశారు. జగన్ను బద్నాం చేయాలని భావించి పావులు కదుపుతున్న కాంగ్రెసు ఇప్పుడు ఇరుక్కు పోతుందన్నారు. ఇంకెందరు ఈ కేసులో రాజీనామా చేయనున్నారో అన్నారు.
మరోవైపు తుంగభద్ర నీటిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ గళం విప్పనున్నారు. ఈ మధ్యాహ్నం మూడు గంటలకు అనంతపురం కలెక్టరేట్లో జరిగే తుంగభద్ర ఎగువ కాలువ ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డు సమావేశానికి ఆమె హాజరు కానున్నారు. ఆమె తుంగభద్ర నీటి విషయమై అందులో చర్చించనున్నారు.