అపోలో ఆస్పత్రిలో నేదురుమల్లి: రోశయ్య పరామర్శ

నేదురుమల్లిని పరామర్శించిన అనంతరం రోశయ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జనార్ధనరెడ్డి స్వల్ప అస్వస్థతతోనే ఆసుపత్రిలో చేరారని, ఆయన క్షేమంగా వున్నారని తెలిపారు. త్వరితగతిన కోలుకుంటున్నారని, నేదురుమల్లి ఒకటి రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని రోశయ్య వివరించారు.
నేదురుమల్లి జనార్ధనరెడ్డి బుధవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఇటీవల ఆసుపత్రిలో చికిత్సల అనంతరం మంగళవారం రాత్రి నెల్లూరు జిల్లా వాకాడుకు నేదురుమల్లి చేరుకొన్నారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఆయన గురువారం పెంచలకోనలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో అస్వస్థతకు గురయ్యారు. దీంతో నేదురుమల్లిని హుటాహుటిన చెన్నైకు తరలించారు.
అనారోగ్యంతో చెన్నయ్ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి కోలుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. జ్వరం, లో బీపీ, శ్వాసకోశ సమస్యలతో బాధ పడుతున్న ఆయనను కుటుంబసభ్యులు గురువారం వేకువజామున 2 గంటలకు వాకాడు నుంచి తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పించారు.












Click it and Unblock the Notifications