బాలయ్య తెలంగాణ ప్రకటన: ఎర్రబెల్లితో కెకె భేటీ
హీరో నందమూరి బాలకృష్ణ తెలంగాణకు తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉందని అవసరమైతే మరోసారి లేఖ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, కాంగ్రెస్ మాజీ పార్లమెంటు సభ్యుడు డా. కె కేశవరావు, తెలంగాణ స్వాతంత్య్రసమరయోధుల కోర్ కమిటి ఛైర్మన్ ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీల సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుందని అంటున్నారు.
హైదరాబాదులోని అశోక్నగర్లోని బాపూజీ నివాసానికి చేరుకున్న ఎర్రబెల్లి, కెకెలు బాపూజీతో సమావేశమై కీలక అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఎర్రబెల్లి, కెకె వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మీడియాకు సమాచారం అందింది. అయితే ఆగస్టు 9 క్విట్ ఇండియా ఉద్యమం, సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనం, అక్టోబర్ 2 గాంధీజయంతి నాటికల్లా తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని లేదంటే స్వాతంత్య్రసమరయోధులందరం గ్రామగ్రామాన పర్యటించి చివరి పోరాటం జరిగి తెలంగాణ సాధించేదిశలో పాటుపడుతామని బాపూజీ నేతృత్వంలో కోర్కమిటి సభ్యులు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే, తెలంగాణ కోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నామని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో కేశవరావు చెప్పిన విషయం తెలిసిందే. ఇంకా ఏమి చేయాలో తెలియడంలేదంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశమైంది. ముగ్గురికి మూడు కారణాలు ఉండగా ఈ ముగ్గురు మీడియాకు తెలియకుండా సమావేశం కావడం చూస్తుంటే ఏదైనా కీలకమైన కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. అయితే బాపూజీ పీఏ మాత్రం బాపూజీని చూడక చాలా రోజులైంది కదా అందుకే ఎర్రబెల్లి, కెకెలు వచ్చారని మీడియాకు చెపుతున్నారు.