గూర్ఖా మోడల్, తెలంగాణకు స్వయంప్రతిపత్తి మండలే?
నాయకత్వ మార్పును, తెలంగాణను ఒకే ప్యాకేజీలో పరిష్కరించాలనే ఆలోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణపై ఇప్పటికే కాంగ్రెసు అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు, పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే సెప్టెంబర్ 7వ తేదీన తెలంగాణపై కీలకమైన ప్రకటన వెలువడుతుందని కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అదే సమయంలో సమస్యకు మండలి ఏర్పాటే అంతిమ పరిష్కారం కాదని, రాష్ట్ర ఏర్పాటుకూ తాము సిద్ధమేనన్న సంకేతాలు కూడా వస్తాయని అంటున్నారు. స్వయంప్రతిపత్తి మండలి ప్రయోగాన్ని కొన్నేళ్లపాటు ప్రయోగించి చూసి అప్పటికీ తెలంగాణ ప్రజలు సంతృప్తి చెందకపోతే రాష్ట్ర ఏర్పాటుకు కూడా సిద్ధపడతామని కేంద్రం, కాంగ్రెస్ అధిష్ఠానం హామీ ఇస్తాయని అంటున్నారు. ఇతర పరిష్కార మార్గాలపైనా కాంగ్రెసు అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించాలని, అవసరమైతే పిసిసి పగ్గాలు కూడా తెలంగాణ నాయకుడికే అప్పగించాలని ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.
నాయకత్వం మార్పు విషయంలో మరో ఆలోచన కూడా ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రినే కొనసాగించడం లేదా సీమాంధ్ర నేతను ముఖ్యమంత్రిగా నియమించి నాలుగు కీలక మంత్రివర్గ శాఖలను తెలంగాణ నేతలకే కేటాయించడమనే ప్రతిపాదన కూడా ఉన్నట్లు చెబుతున్నారు. సమర్ధుడైన నాయకుడి కోసం ఇద్దరు సభ్యులతో ఒక సెర్చ్ కమిటీని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏర్పాటు చేసినట్లు వినికిడి.
ఈ కమిటీ ఇప్పటికే ఐదుగురు నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వీరిలో ముగ్గురు తెలంగాణకు చెందిన వారు కాగా రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లు సమాచారం. ఈ ఐదుగురు నేతల గుణగణాలను, సమర్థతను సెర్చ్ కమిటీ అధ్యయనం చేస్తోంది. ఈ కమిటీ అభిప్రాయాలపైనే సోనియా నేతృత్వంలోని కోర్ కమిటీ అంతిమ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.
మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం నెల రోజులు పట్టవచ్చని అంటున్నారు. అయితే సెర్చ్ కమిటీ సూచించిన పేర్లపై కోర్కమిటీ సంతృప్తికరమైన నిర్ణయానికి రాకపోతే ముఖ్యమంత్రి మార్పు వాయిదా పడవచ్చునని కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్పటేల్, మరో సీనియర్ నేత వయలార్ రవి రాష్ట్ర పరిస్థితిపై కీలక మంతనాలు జరిపారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్తో కూడా వయలార్ భేటీ అయ్యారు.
అయితే, తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం ఇదే పద్ధతిలో ఆలోచిస్తోందని చెప్పడానికి ఆధారాలు కూడా ఏమీ లేవు. కానీ, నెల రోజుల్లోగా నాయకత్వ మార్పుపై, తెలంగాణపై ఓ స్పష్టత రావచ్చునని అంటున్నారు.